
Team India: ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్లో భారత జట్టు (India national cricket team) అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ (New Zealand) పై ఘన విజయం సాధించింది. నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసి, కివీస్ను 159 పరుగులకు ఆలౌట్ చేసింది.
ఈ విజయం ద్వారా భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుని భారీ రికార్డ్ నెలకొల్పింది. అలాగే, వరుసగా రెండోసారి టైటిల్ తోపాటు స్వదేశంలో ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా చారిత్రాత్మక ఘనతలు సాధించింది.
అయితే, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు హీరోలు ఎవరో ఓసారి చూద్దాం..
సంజూ సామ్సన్ ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్పై 97 నాటౌట్, ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్పై ఫైనల్లో 89 పరుగులతో దంచి కొట్టాడు. ఈ మూడు కీలక ఇన్నింగ్స్లతో భారత్కు విజయం అందించాడు. అందుకే అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇషాన్ కిషన్ కూడా టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడాడు. ఫైనల్లో కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి భారత్కు బలమైన ఆరంభం ఇచ్చాడు. పాకిస్తాన్పై కూడా కీలక మ్యాచ్లో 77 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
శివమ్ దూబే మధ్య ఓవర్లలో కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్పై 66 పరుగులు, ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో 43 పరుగులు, ఫైనల్లో 8 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లు సరైన సమయంలో వచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాయి.
హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్లో ఆల్రౌండర్గా అద్భుతంగా రాణించాడు. పవర్ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు బౌలింగ్ చేసి కెప్టెన్కు నమ్మకంగా నిలిచాడు. ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో అతని 12 బంతుల్లో 27 పరుగులు భారత్ స్కోర్ను 250 దాటించాయి.
జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నమెంట్లో భారత బౌలింగ్కు నాయకత్వం వహించాడు. ఫైనల్లో అతను కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. సెమీఫైనల్, ఫైనల్ రెండింట్లోనూ తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యర్థి జట్టుకు భారీ దెబ్బ ఇచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..