
PAK vs ENG :
PAK vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి ఘనంగా ప్రవేశించింది. పాక్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన వీరోచిత సెంచరీతో కంప్లీట్ చేశాడు. ఒకానొక దశలో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ధాటికి ఇంగ్లండ్ వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినా, బ్రూక్ ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ కేవలం 19.1 ఓవర్లలోనే 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 63) అర్ధశతకంతో జట్టుకు మంచి పునాది వేశాడు. బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25) ఫర్వాలేదనిపించినా, మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో పాక్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ మూడు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభం అత్యంత దారుణంగా ఉంది. షాహీన్ అఫ్రిదీ తన పదునైన బంతులతో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (2)లను వెనువెంటనే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్ (8), టామ్ బాంటన్ (2) కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి జట్టును సెమీస్ చేర్చాడు. 17వ ఓవర్లో బ్రూక్ అవుట్ అయినా, విల్ జాక్స్ (28) మిగిలిన పని పూర్తి చేశాడు.
ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దయ్యి ఒక పాయింట్తో ఉన్న పాక్, ఇప్పుడు శ్రీలంకతో జరిగే మ్యాచ్లో భారీ విజయం సాధించడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసి 4 పాయింట్లతో టేబుల్ టాప్లో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..