
ICC Confirms U-19 World Cup 2026 Schedule: గత కొన్నేళ్లుగా దాదాపు ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్లను ఒకే గ్రూపులో ఉంచడం లేదా టోర్నమెంట్ ఫార్మాట్ను ఇరు జట్లు తలపడేలా రూపొందించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, అండర్-19 స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరోసారి ఈ రెండు జట్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచింది.
2026లో జరగనున్న అండర్-19 పురుషుల వరల్డ్ కప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనున్న ఈ టోర్నమెంట్ గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా, వాటిని 4 గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచడం వల్ల లీగ్ దశలో వీరి మధ్య పోటీ ఉండదు.
భారత్ (గ్రూప్ A): ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ను గ్రూప్ Aలో ఉంచారు. ఈ గ్రూపులో భారత్తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా ఉన్నాయి.
పాకిస్తాన్ (గ్రూప్ B): పాకిస్తాన్ను ఆతిథ్య జింబాబ్వే, ఇంగ్లాండ్, స్కాట్లాండ్లతో పాటు గ్రూప్ Bలో ఉంచారు.
గ్రూప్ C: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక.
గ్రూప్ D: టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా.
ఈ టోర్నమెంట్ 2026 జనవరి 15న ప్రారంభమై ఫిబ్రవరి 6న ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. నమీబియా, జింబాబ్వేలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
జనవరి 15: భారత్ vs అమెరికా (బులవాయో)
జనవరి 17: భారత్ vs బంగ్లాదేశ్ (బులవాయో)
జనవరి 24: భారత్ vs న్యూజిలాండ్ (బులవాయో)
గత రెండు అండర్-19 వరల్డ్ కప్లలో కూడా భారత్, పాకిస్తాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. అప్పుడు కూడా ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. అయితే, ఈసారి సూపర్-6 దశ నుంచి ఫైనల్ వరకు ఏ దశలోనైనా ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..