
ఫిబ్రవరి 15న జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లో భారత్తో తలపడకుండా తన జట్టును ఆదేశించిన పాకిస్థాన్ ప్రభుత్వం గత ఆదివారం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఐసీసీ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాక్ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, భారత్తో జరిగే మ్యాచ్ను మాత్రం ‘బహిష్కరిస్తున్నట్లు’ ప్రకటించింది. బంగ్లాదేశ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నీ నుంచి తప్పించినందుకు నిరసనగా, ఆ దేశానికి ‘సంఘీభావం’ తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఐసీసీ చర్య తర్వాత, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మొత్తం టోర్నీని బహిష్కరించే ఆలోచన చేసినప్పటికీ, చివరికి కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే వదులుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ ‘సెలెక్టివ్ బాయ్కాట్’ (ఎంచుకున్న మ్యాచ్ను మాత్రమే బహిష్కరించడం) ఐసీసీ నిబంధనల ప్రకారం అనుమతించబడుతుందా? అసలు ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
సాంకేతికంగా, పాకిస్థాన్ టోర్నీలో ఒక్క మ్యాచ్ను మాత్రమే వదులుకోవచ్చు. అలా చేయకుండా అడ్డుకునే నిబంధన ఏదీ ఐసీసీలో లేదు. అయితే, ఇలా చేసే జట్లు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక జట్టు మైదానంలోకి రావడానికి నిరాకరిస్తే, ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటిస్తారు. భారత్కు ఆ పాయింట్లు రావాలంటే, భారత జట్టు వేదిక వద్దకు చేరుకోవాలి. భారత కెప్టెన్ (సూర్యకుమార్ యాదవ్) టాస్ కోసం వచ్చి, పాకిస్థాన్ కెప్టెన్ (సల్మాన్ అలీ ఆఘా) రాకపోతే, మ్యాచ్ రెఫరీ అధికారికంగా భారత్కు 2 పాయింట్లు కేటాయిస్తారు.
అంతేకాదు, క్లాజ్ 16.10.7 ప్రకారం, మ్యాచ్ను బహిష్కరించిన జట్టు 20 ఓవర్లు ఆడి 0 పరుగులు చేసినట్లుగా పరిగణిస్తారు. దీనివల్ల వారి నెట్ రన్ రేట్ భారీగా తగ్గిపోతుంది. మిగిలిన మ్యాచ్ల్లో గెలిచినా వారు సూపర్-8 దశకు చేరుకోవడం అత్యంత కష్టమవుతుంది.
పీసీబీ (PCB) కి అసలైన సమస్య ఇక్కడే మొదలవుతుంది. భారత్-పాక్ మ్యాచ్ కేవలం టోర్నీకే కాదు, మొత్తం క్రికెట్ వ్యవస్థకే ప్రధాన ఆదాయ వనరు. బ్రాడ్కాస్టర్లు (జియో స్టార్ వంటి సంస్థలు) సుమారు 25 మిలియన్ల నుంచి 30 మిలియన్ డాలర్ల ప్రకటనల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దీనివల్ల వారు ఐసీసీని నష్టపరిహారం కోరతారు. ఆ ఆర్థిక నష్టాన్ని ఐసీసీ నేరుగా పీసీబీ నుంచి వసూలు చేసే హక్కు కలిగి ఉంటుంది.
ఐసీసీ నుంచి పీసీబీకి అందే వార్షిక ఆదాయ వాటా (ఇది పాకిస్థాన్ క్రికెట్ బడ్జెట్లో 70-80%) నిలిపివేసే అవకాశం ఉంది. ఇది ఆ బోర్డును ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవచ్చు.
ఐసీసీ రాజ్యాంగం (ఆర్టికల్ 2.4 D) ప్రకారం, సభ్య దేశాల బోర్డులు స్వతంత్రంగా వ్యవహరించాలి. ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడం వల్ల ఐసీసీ చర్యల నుంచి రక్షణ ఉంటుందని మాజీ పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి వాదించినప్పటికీ, ఇలా ఒక మ్యాచ్లో పాల్గొని మరొకటి వదులుకోవడం టోర్నీ స్ఫూర్తిని ఉల్లంఘించినట్లే అవుతుంది.
గతంలో (1996, 2003) భద్రతా కారణాల దృష్ట్యా జట్లు మ్యాచ్లను బహిష్కరించాయి (ఉదాహరణకు శ్రీలంకలో ఆడటానికి ఆస్ట్రేలియా నిరాకరించడం). అయితే, పాకిస్థాన్ ఇప్పుడు తటస్థ వేదిక అయిన శ్రీలంకలో మ్యాచ్ను బహిష్కరిస్తోంది కాబట్టి, ఇక్కడ ప్రభుత్వ జోక్యానికి తగిన కారణం లేదని భావిస్తున్నారు. అందువల్ల, ఈ చర్య ఐసీసీ రాజ్యాంగాన్ని నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..