
Pakistan lowest score vs Bangladesh: మిర్పూర్లోని షేర్-ఎ-బాంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు అవమానకర పరాజయాన్ని చవిచూసింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని సులభంగా చేధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టులో లేకపోవడం పాకిస్తాన్ బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కు కూడా చేరుకోలేకపోయిన పాకిస్తాన్కు ఈ ఓటమి మరింత నిరాశ కలిగించింది.
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నమోదు చేసిన 114 పరుగులు బంగ్లాదేశ్పై వన్డేల్లో అత్యల్ప స్కోరుగా నిలిచింది. అంతకుముందు 1999లో పాకిస్తాన్ 161 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ను పాకిస్తాన్ జట్టు కొత్త ఆరంభంగా భావించినప్పటికీ, మైదానంలో మాత్రం జట్టు పూర్తిగా ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. టీ20 వరల్డ్ కప్ వైఫల్యం ప్రభావం ఇంకా జట్టుపై కొనసాగుతున్నట్లు కనిపించింది.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఈ మ్యాచ్ను చాలా సులభంగా ముగించింది. కేవలం 15.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. తంజీద్ హసన్ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు మళ్లించాడు. అతను కేవలం 42 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును విజయానికి చేర్చాడు. అతని ఇన్నింగ్స్లో ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతను వేసిన ఐదు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో అసలైన హీరో బంగ్లాదేశ్ యువ పేసర్ నాహిద్ రాణానే. అదనపు వేగం, బౌన్స్ను ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ బ్యాటింగ్ను పూర్తిగా కూల్చేశాడు. రాణా 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి పాకిస్తాన్ టాప్ ఆర్డర్ను చిత్తు చేశాడు. అతని వేగం, ఖచ్చితత్వానికి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ వద్ద సమాధానం లేకపోయింది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కొంత స్థిరంగా కనిపించింది. 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అయితే సహిబ్జాదా ఫర్హాన్ (27) అవుట్ అయిన తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. చివరి తొమ్మిది వికెట్లు కేవలం 73 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మహమ్మద్ రిజ్వాన్ (10), సల్మాన్ అలీ ఆఘా (5) నిరాశపరిచారు. డెబ్యూ ఆటగాళ్లు మాజ్ సదాకత్ (18), షమీల్ హుస్సేన్ (4) కూడా రాణా వేగాన్ని ఎదుర్కోలేకపోయారు. సిరీస్లో రెండో వన్డే మార్చి 13న, మూడో మ్యాచ్ మార్చి 15న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..