
Jasprit Bumrah Injury: శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం తగ్గకపోవడంతో ఈ పర్యటనకు దూరం కానున్నాడు. బిసిసిఐ వైద్యాధికారుల సూచనల మేరకు బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ పేస్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకంతో శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసినప్పటికీ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదు. రాబోయే ముఖ్యమైన మ్యాచ్లను దృష్టిలో ఉంచుకొని బుమ్రాపై అనవసర ఒత్తిడి తేకూడదని బిసిసిఐ వైద్య బృందం నిర్ణయించింది. వైద్యుల సలహా మేరకు అతడికి మరికొంత విశ్రాంతి నివ్వాలని సెలెక్టర్లు భావించారు.
బుమ్రా దూరమవ్వడంతో జమ్మూ కాశ్మీర్కు చెందిన 29 ఏళ్ల పేస్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీకి జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం దాదాపు ఖాయమైంది. పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఆధారంగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనున్న మూడో ఆటగాడిగా నబీ నిలవనున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో అతడు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనే అతడిని ఈ స్థాయికి తీసుకెళ్లింది.
దేశవాళీ రంజీ ట్రోఫీలో ఆకిబ్ నబీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి ఏకంగా 100కు పైగా వికెట్లు పడగొట్టి జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లోనూ ఉపయోగపడే ఆల్రౌండర్ సామర్థ్యం ఉండటం అతడికి అదనపు బలంగా మారింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ పర్యటనలో రెండు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీసి సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు.
శ్రీలంక పర్యటన కోసం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 4న కొలంబో బయలుదేరనుంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు కొలంబోలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరగనున్నాయి. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్లతో కూడిన భారత పేస్ దళానికి ఆకిబ్ నబీ తోడుకానున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..