
IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అంటే కేవలం కూపర్ కానోలీ విధ్వంసకర బ్యాటింగ్ మాత్రమే కాదు, పంజాబ్ స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన ఒక లాంగ్ ఓవర్ కూడా హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఒక ఓవర్ అంటే ఆరు బంతులు ఉంటాయి. కానీ అర్షదీప్ మాత్రం ఏకంగా 11 బంతులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పి వైడ్లు, నో బాల్స్ వేయడంతో ఈ ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పొడవైన ఓవర్గా రికార్డులకెక్కింది.
ఆఖరి ఓవర్లో ఏం జరిగింది?
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్లో 20వ ఓవర్ వేసే బాధ్యతను పంజాబ్ కెప్టెన్ అర్షదీప్ సింగ్కు అప్పగించాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 150/6. ఇన్నింగ్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తాడనుకుంటే, అర్షదీప్ మొదటి బంతినే వైడ్తో ప్రారంభించాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియాను కట్టడి చేసే క్రమంలో వరుసగా వైడ్లు, నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో తెవాటియా ఒక ఫోర్ కొట్టినా, అర్షదీప్ వేసిన అదనపు బంతులు పంజాబ్ శిబిరాన్ని టెన్షన్ పెట్టాయి. చివరికి ఒక వైడ్ బాల్ను డీఆర్ఎస్ ద్వారా అంపైర్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓవర్ 11 బంతుల వద్ద ముగిసింది.
గతంలోనూ ఇలాంటి లాంగ్ ఓవర్లు
అర్షదీప్ సింగ్ ఈ అరుదైన చెత్త రికార్డును సృష్టించిన మొదటి బౌలర్ ఏమీ కాదు. ఐపీఎల్ చరిత్రలో గతంలో ఐదుగురు బౌలర్లు ఒకే ఓవర్లో 11 బంతులు వేసి ఈ జాబితాలో నిలిచారు. 2023లో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే ఈ ఘనత సాధించగా, 2025 సీజన్లో శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఒకే ఓవర్లో 11 బంతులు వేసి అన్వాంటెడ్ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పుడు అర్షదీప్ కూడా ఆ క్లబ్లో చేరిపోయాడు.
వైడ్లు, నో బాల్స్ తో తలపోటు
అర్షదీప్ సింగ్ ఒకానొక దశలో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ ఫామ్ కనిపించలేదు. ముల్లాన్పూర్ పిచ్పై గ్రిప్ దొరక్కపోవడం లేదా తెవాటియా లాంటి ఫినిషర్ను చూసి ఒత్తిడికి లోనవ్వడం వల్లనో కానీ, వరుసగా వైడ్లు వేయడం విమర్శలకు దారితీసింది. ఆఖరి ఓవర్లో ఇన్ని ఎక్స్ట్రాలు ఇస్తే మ్యాచ్ ఫలితం మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదృష్టవశాత్తూ బ్యాటింగ్ లో కానోలీ మెరవడంతో పంజాబ్ గట్టెక్కింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..