
2026 ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్-16లో అర్జెంటీనా అద్భుత పునరాగమనంతో ఈజిప్ట్ను 3-2 తేడాతో ఓడించి క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఈజిప్ట్ స్టార్ ఫార్వర్డ్ మోస్తఫా జికో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ఫుట్బాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మ్యాచ్ రిఫరీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జికో.. “వరల్డ్ కప్ను అర్జెంటీనాకు ఇచ్చేయండి, ఈ టోర్నమెంట్ ముందే ఫిక్స్ అయింది” అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్లో తొలి గంట పాటు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఈజిప్ట్ యాసర్ ఇబ్రహీం, మోస్తఫా జికో గోల్స్తో 2-0 ఆధిక్యంలో నిలిచింది. 60వ నిమిషంలో జికో మరోసారి బంతిని గోల్లోకి పంపి స్కోరును 3-0గా మార్చినట్లు కనిపించినా.. వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) జోక్యంతో ఆ గోల్ను రద్దు చేశారు.
గోల్కు ముందు హైస్సెమ్ హసన్ అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్పై ఫౌల్ చేసినట్లు తేలడంతో రిఫరీ గోల్ను తిరస్కరించాడు. అనంతరం ఈజిప్ట్కు దక్కిన మరో పెనాల్టీని కూడా నిరాకరించడంతో వివాదం మరింత ముదిరింది. మ్యాచ్ అనంతరం రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్పై జికో తీవ్ర విమర్శలు గుప్పించాడు. ప్రముఖ ఫుట్బాల్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో వెల్లడించిన వివరాల ప్రకారం.. “రిఫరీ అన్యాయం చేశాడు. మా దేశం చేసిన కష్టాన్ని వృథా చేశాడు. దేవుడే అన్నీ చూస్తున్నాడు” అని జికో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, “కప్ను అర్జెంటీనాకు ఇస్తున్నారు. వాళ్లే ప్రపంచకప్ గెలుస్తారు. మ్యాచ్ ప్రారంభం నుంచే రిఫరీ మాకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. అర్జెంటీనాను 2-0తో ఓడించి ముందుకు వెళ్లేందుకు మాకు అవకాశం ఇవ్వలేదు. ఈ టోర్నమెంట్ ముందే ఫిక్స్ అయింది” అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడర్తో అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 83వ నిమిషంలో లియోనెల్ మెస్సీ కీలక గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఇది ప్రపంచకప్లో మెస్సీకి రికార్డు స్థాయిలో 21వ గోల్ కావడం విశేషం. చివరగా ఇంజ్యూరీ టైమ్లో ఎంజో ఫెర్నాండెజ్ విజేత గోల్ నమోదు చేయడంతో అర్జెంటీనా అసాధారణ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో VAR నిర్ణయాలు, రిఫరీ తీర్పులు, జికో చేసిన ‘టోర్నమెంట్ ఫిక్స్’ ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కాగా, ఈ ఆరోపణలకు ఫీఫా లేదా మ్యాచ్ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
మరిన్ని ఫిఫా వరల్డ్ కప్ 2026 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి