
హిందూ ధర్మంలో ఆలయ సందర్శనం అనేది ముఖ్యమైన సంప్రదాయం. ప్రతిరోజూ ఆలయానికి వెళ్లడం ద్వారా మనలో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం. హిందూ సంప్రదాయంలో ప్రతీ ఆచారానికి ఒక కారణం ఉంటుంది. అలాగే, దేవాలయంలో దైవ దర్శనం ముగిసిన తర్వాత భక్తులు భక్తిశ్రద్ధలతో తలవంచి ‘శఠగోపాన్ని’ స్వీకరిస్తారు. దీనిని కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాకుండా, భక్తుడికి దైవానికి మధ్య జరిగే ఒక ఆత్మీయ సంభాషణగా పండితులు అభివర్ణిస్తారు. శఠగోపం తలపై ఉంచినప్పుడు భగవంతుని పాదాలనే మనం శిరస్సుపై ధరిస్తున్నామనే భావన కలగాలి. అందుకే ఆ క్షణం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది.
ఆ సమయంలో పక్కనున్న వారికి, కనీసం ఆ శఠగోపం ఉంచే పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తన కోరికను చెప్పుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన సంకల్పం నేరుగా ఆ పరమాత్ముడికి చేరుతుందని నమ్మకం.
ఈ పవిత్ర స్పర్శ ద్వారా మన మనసులోని కోరికలు సిద్ధించడమే కాకుండా, శరీరంలోని నాడులకు ఒక రకమైన సానుకూల శక్తి లభిస్తుంది. శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా చూస్తే.. శఠగోపాన్ని తలపై ఉంచడం అంటే మానవ సహజమైన అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) దైవ ప్రసన్నంతో అదుపులో ఉంచుకోవడమే. మనలోని అహంకారాన్ని వీడి, దుర్గుణాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించే గొప్ప ప్రక్రియ ఇది. ఈ వినయం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది.
చివరగా, శఠగోప దర్శనం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది మనసును ప్రక్షాళన చేసే ఒక అద్భుత సాధనం. దీనివల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు, ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఏకాగ్రతతో, భక్తితో శఠగోపాన్ని స్వీకరిస్తే మన జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ సమయంలో భగవంతుడిని నిస్వార్థంగా కోరికలు కోరితే నెరవేరుతాయని నమ్మకం ఉంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)