
సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి పవిత్ర ప్రాముఖ్యత ఉంది. ఇక, ఏడాదిలో వచ్చే కొన్ని ప్రత్యేక ఏకాదశులలలో ఉపవాసంతోపాటు వత్రాలు చేసి మహా విష్ణువును ఆరాధిస్తారు. ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా ఒక సంవత్సరంలో ప్రతి నెలలో రెండు చొప్పున.. 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో కనీసం 11 ఏకాదశులు నిష్ఠగా ఆచరించినవారికి పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు. అలాగే, ఏకాదశి ఉపవాసాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాపక్షయము, మోక్షప్రాప్తి కలుగుతాయని పురాణాలలో పేర్కొనబడింది. ఫిబ్రవరిలో మొదటగా వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. విజయ అనే పేరు అర్ధం “విజయం”. ఈ ఏకాదశి మహా విష్ణువుకు అంకితం అయిన పవిత్ర వ్రతం. పూజలు, ఉపవాసం, నమస్కారాలతో ఈ రోజు పాటిస్తే మనసు, శరీరం పై పూర్ణ విశ్వాసం, శ్రేయస్సు, చెడ్డ శక్తుల పై విజయం లభిస్తుందని భావిస్తారు. వ్రతం పూజ, సత్కార్యాల్లో పాల్గొనడం, మహానామ జపం చేయడం ప్రత్యేక శుభ ఫలితాలు ఇస్తుందని పౌరాణిక విశ్వాసం ఉంది.
దశమి, ఏకాదశి, ద్వాదశి.. ఈ మూడు తిథులను కలిపి “హరిత్రయం” అంటారు. ఏకాదశిని “హరివారం” అని కూడా పిలుస్తారు. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని పూర్తిస్థాయిలో ఆచరించాలంటే ఈ మూడు రోజులూ నియమ నిష్ఠలతో ఉండాలని పండితులు సూచిస్తారు.
దశమి రోజు: సాయంత్రం తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, శనగపప్పు, పప్పులు, ఆకుకూరలు వంటి ఆహారాలను వర్జించాలి. రాత్రి భూశయనం చేసి, మరుసటి రోజు తెల్లవారుజామున లేవడానికి సిద్ధంగా ఉండాలి.
ఏకాదశి రోజు: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, పూజా మందిరంలో సంకల్పంతో వ్రతాన్ని ప్రారంభించాలి.
ఏకాదశ్యాం నిరాహారో
భూత్వాహం అపపే హని
భోక్యామి పుండరీకాక్ష
శరణం మే భవాచ్యుత
ఏకాదశి రోజు అన్నం తీసుకోకూడదు. కొందరు నిర్వాణ ఉపవాసం (నీరు కూడా తీసుకోకుండా) చేస్తారు. అది సాధ్యం కానివారు పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకోవచ్చు. రోజంతా భగవన్నామస్మరణ, పూజ, ధ్యానం చేయాలి. కోపం, అసహనం వంటి భావాలను దూరంగా ఉంచి ప్రశాంతంగా ఉండాలి. వినోద కార్యక్రమాలు, వ్యర్థ సంభాషణలు తగ్గించడం మంచిది.
ఈ రోజున చెట్ల నుంచి ఆకులు కోయరాదు. ముఖ్యంగా తులసి ఆకులు తెంపకూడదు. విష్ణుమూర్తికి తులసి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు.
ద్వాదశి రోజు: బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణా-తాంబూలాదులు సమర్పించిన తర్వాత పారణ చేయాలి (ఉపవాస విరమణ).
అజ్ఞాన తిమిరాంధస్య
వ్రతేనానేన కేశవ
ప్రసీద సుముఖోనాధ
జ్ఞాన దృష్టి వ్రతోభవ
ఏకాదశి” అంటే పదకొండు.. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు. వీటిని నియంత్రించుకోవడమే ఈ వ్రతానికి అసలైన అర్థం.
తలంటు స్నానం, క్షవరం చేయరాదు.
ఈ మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి.
సంయమనం, శుచిత్వం పాటించాలి.
చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరించినవారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శాంతి సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకే ఈరోజును విష్ణు భక్తులు పరమ పవిత్ర దినంగా జరుపుకుంటారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)