
వట సావిత్రి వ్రతం (Vata Savitri Vratam) అనేది హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు భర్త దీర్ఘాయుష్షు కోసం, సంతానం కోసం చేసే ముఖ్యమైన వ్రతం. వట సావిత్రి వ్రతం సాధారణంగా వైఖ మాసంలో అమావాస్య రోజున (కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి రోజున కూడా) నిర్వహిస్తారు. వట సావిత్రి వ్రతాన్ని సంవత్సరంలో రెండు సార్లు ఆచరిస్తారు.
మొదటిది వైశాఖ అమావాస్య నాడు, రెండవది జ్యేష్ఠ పౌర్ణమి రోజున. ఈ రెండు పర్వదినాల మధ్య సుమారు 15 రోజుల వ్యవధి ఉంటుంది. స్త్రీలు తమ భర్త ఆయుష్షు, కుటుంబ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇది పాతివ్రత్య ధర్మానికి, త్యాగానికి, భక్తికి ప్రతీకగా భావించబడుతుంది. అలాగే స్త్రీ శక్తి, ధర్మపాలనకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే వ్రతంగా ప్రసిద్ధి పొందింది.
ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య 2026 మే 16న వస్తుంది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి 2026 జూన్ 29న జరుగుతుంది. ఈ రోజుల్లో మర్రి చెట్టును పూజించడం ప్రధాన ఆచారం.
ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించే స్త్రీకి సకల శుభాలు కలుగుతాయని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. భర్త దీర్ఘాయుష్షుతో జీవిస్తాడని, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని విశ్వాసం. మరణానంతరం పుణ్యఫలంగా స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి.
మర్రి చెట్టు దీర్ఘాయువు, స్థిరత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. అందుకే భర్త ఆయుష్షు కోసం దీనిని పూజిస్తారు. విశ్వాసం ప్రకారం చెట్టులో త్రిమూర్తుల సాన్నిధ్యం ఉంటుంది. మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని చెబుతారు.
పురాణ కథనాల ప్రకారం సీతాదేవి మర్రి చెట్టుకు వరం ఇచ్చినట్లు నమ్మకం ఉంది. అలాగే గయలోని పవిత్ర మర్రి చెట్టు వద్ద పితృకార్యాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వేద, పురాణ గ్రంథాలలో కూడా మర్రి చెట్టు మహిమను ప్రత్యేకంగా వివరించారు. అందుకే వట సావిత్రి వ్రతానికి అంతటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)