
చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న రతన్పూర్ గ్రామంలో ఒక అద్భుతమైన, విలక్షణమైన ఆలయం ఉంది. ఇక్కడ హనుమంతుడు పురుష రూపంలో కాకుండా, స్త్రీ రూపంలో (Female Avatar) కొలువై ఉండటం విశేషం. రతన్పూర్లోని ఈ ఆలయాన్ని గిర్జాబంద్ హనుమాన్ ఆలయం అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా హనుమంతుడు స్త్రీ రూపంలో పూజలందుకునే ఏకైక క్షేత్రం ఇదే కావడం గమనార్హం.
ఇక్కడ హనుమంతుడి విగ్రహం ముఖం, శరీరం స్త్రీ రూపంలో ఉంటాయి. విగ్రహం తూర్పు ముఖంగా ఉండి, భుజంపై రాముడు, లక్ష్మణుడిని మోస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే విగ్రహం పాదాల కింద ఇద్దరు రాక్షసులు అణచివేయబడి ఉంటారు. ఈ ఆలయాన్ని కొన్ని వందల ఏళ్ల క్రితం రతన్పూర్ రాజు పృథ్వీ దేవ్జూ నిర్మించినట్లు చెబుతారు. రాజు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, హనుమంతుడు అతనికి కలలో కనిపించి ఈ రూపాన్ని వెల్లడించినట్లు స్థానిక కథనం.
స్థానిక కథనాల ప్రకారం, రాజా పృథ్వీ దేవ్ భక్తుడు. హనుమంతుడు అతని కలలో కనిపించి, తనకు ఒక ఆలయాన్ని నిర్మించాలని, ఆ విగ్రహం చెరువు అడుగున లభిస్తుందని చెప్పాడు. రాజు ఆ చెరువును తవ్వించగా, అక్కడ స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత రాజు తన వ్యాధి నుండి విముక్తుడయ్యాడని భక్తులు నమ్ముతారు.
ఇక అప్పటి నుండి ఇక్కడ హనుమంతుడిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికతతో పాటు, ఈ విభిన్నమైన విగ్రహాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. హనుమంతుడి ఈ అరుదైన రూపం వెనుక ఉన్న భక్తి, చరిత్ర నిజంగా ఆశ్చర్యకరమైనవి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..