AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథస్వామి!

Soumyanatha Swamy Temple: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాల్లో అన్నమయ్య జిల్లాలోని నందలూరి సౌమ్యనాథస్వామి ఆలయం ప్రత్యేక స్థానం కలిగింది. ఇక్కడ శ్రీమహావిష్ణువు సౌమ్యనాథస్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలు తీర్చుతాడనే విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ ఆలయ రహస్యాల గురించి తెలుసుకుందాం.

దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథస్వామి!
Soumyanatha Swamy Temple
Rajashekher G
|

Updated on: May 20, 2026 | 3:57 PM

Share

దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన దేవాలయాలు తమ వైభవం, విశేషాలతో భక్తులను ఆకట్టుకుంటుంటాయి. అలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి అన్నమయ్య జిల్లాలోని నందలూరులో వెలసిన సౌమ్యనాథస్వామి దేవాలయం. ఇక్కడ శ్రీమహావిష్ణువు “సౌమ్యనాథస్వామి” రూపంలో భక్తులకు దర్శనమిస్తూ అభయహస్తంతో కరుణ కటాక్షాలు ప్రసాదిస్తాడని విశ్వాసం.

స్థలపురాణం

పురాణ కథనాల ప్రకారం, ఒకసారి నారద మహర్షి కోరికతో మహావిష్ణువు భూలోకంలోని ప్రకృతి సౌందర్యాలను దర్శించేందుకు బయల్దేరాడట. అలా ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడి ప్రశాంత వాతావరణం చూసి స్వామి పరవశించాడని చెబుతారు. అది గమనించిన నారదుడు, కలియుగంలో ఈ ప్రాంతంలోనే కొలువై భక్తులను రక్షించాలని ప్రార్థించాడట. ఆ ప్రార్థనను అంగీకరించిన విష్ణుమూర్తి అప్పట్లో “నెలందలూరు”గా పిలవబడిన ఈ ప్రాంతంలో శిలారూపంలో అవతరించాడని కథనం.

తర్వాత దేవతలు చెయ్యేరు నది తీరాన ఆలయాన్ని నిర్మించగా, నారద మహర్షి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానిక విశ్వాసం చెబుతోంది.

చరిత్ర చెబుతున్న వైభవం

కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకోగా, 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగుడు తిరిగి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చరిత్ర పేర్కొంటోంది. అనంతరం కాకతీయులు, పాండ్యులు, విజయనగర రాజులు కూడా ఆలయ అభివృద్ధికి సహకరించారని తెలుస్తోంది.

సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు రాజగోపురాల నడుమ ఈ ఆలయం నిర్మించబడింది. పూర్తిగా ఎర్రరాతితో నిర్మితమైన ఈ దేవాలయం శిల్పకళకు నిదర్శనం. ఆలయంలోని 108 స్తంభాలపై భాగవత ఘట్టాలు చెక్కబడి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిపై అనేక కీర్తనలు రచించినట్లు చెబుతారు.

కోరికలు తీర్చే స్వామి

గర్భగుడిలోని సౌమ్యనాథస్వామి విగ్రహం సుమారు ఏడు అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. స్వామివారి రూపం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని తలపించేలా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి గర్భగుడి వరకు దూరం ఉన్నప్పటికీ, మూలవిరాట్టు రూపం స్పష్టంగా కనిపించడం విశేషంగా భావిస్తారు.

కొన్ని ప్రత్యేక దినాల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడటం మరో ప్రత్యేకత. భక్తులు మనసులో కోరిక కోరుకుని స్వామిని ధ్యానిస్తూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేస్తే ఆశయాలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ఆనవాయితీగా కొనసాగుతోంది.

దర్శించదగిన ఉపాలయాలు, ఉత్సవాలు

ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, యోగ నరసింహస్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ జరిగే నిత్యపూజలతో పాటు ఆషాఢమాస బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించే లక్ష తులసీ అర్చన విశేషంగా జరుగుతాయి. శ్రావణం, ధనుర్మాస ఉత్సవాల సమయంలో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

నందలూరు రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌ నుంచి ఆలయం సుమారు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప నుంచి తిరుపతి, రాజంపేట వైపు వెళ్లే బస్సులు నందలూరులో ఆగుతాయి. విమాన ప్రయాణం చేసేవారు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్లవచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us