
హిందూ మతంలో శివారాధనకు బిల్వపత్రానికి ఉన్నంత ప్రాధాన్యత మరే ఇతర పత్రానికీ లేదు. “త్రితలం త్రిగుణకారం త్రినేత్రంజ త్రియాయుతం” అన్నట్లుగా.. మూడు ఆకులు కలిసి ఉండే ఈ పత్రం జన్మజన్మల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం, మందర పర్వతంపై పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె చెమట బిందువు నేలపై పడగా బిల్వ వృక్షం ఉద్భవించింది. ఈ చెట్టు వేర్లలో గిరిజాదేవి, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో దాక్షాయిని, ఆకులలో పార్వతీ దేవి నివసిస్తారు. అంటే, బిల్వ వృక్షం సాక్షాత్తు ఉమాదేవి స్వరూపంగా భావించబడుతుంది.
పాప విముక్తి – ఆధ్యాత్మిక శక్తి!
శివారాధనలో బిల్వపత్రం సమర్పించడం వల్ల మూడు జన్మల పాపాలు నశిస్తాయి. ఎండిపోయిన బిల్వ ఆకులు కూడా పవిత్రమైనవేనని, వాటిని కూడా పూజకు ఉపయోగించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, మాస శివరాత్రి సోమవారాల్లో బిల్వపత్రాలతో అభిషేకం చేయడం వల్ల కోట్లాది పుణ్యాల ఫలం దక్కుతుంది.
వేటగాడి కథ – ఆపత్కాల పూజ ఫలితం:
ఒకసారి ఒక వేటగాడు అడవిలో క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి బిల్వ వృక్షం ఎక్కి, తెలియకుండానే శివలింగంపై బిల్వ ఆకులను పడేలా చేశాడు. ఆ చిన్న క్రియే అతనికి మోక్షాన్ని ప్రసాదించింది. అంటే, అనుకోకుండా చేసినా, తెలిసి చేసినా బిల్వార్చన అత్యంత శక్తివంతమైనదని దీని ద్వారా అర్థమవుతుంది.
బిల్వ పత్రం పూజకు కావలసిన నియమాలు:
మహాలక్ష్మి నివాసం: బిల్వ పత్రాల మధ్య భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ముగ్గురు దేవతల స్వరూపం: మూడు ఆకులు సత్త్వ, రజో, తమో గుణాలకు శివుని మూడు కళ్లకు ప్రతిరూపాలు.
నియమాలు:
ఆకులను ఎప్పుడూ చింపివేయకూడదు.
పూజకు ముందు నీటితో శుభ్రంగా కడగాలి.
చతుర్దశి, అష్టమి, అమావాస్య రోజుల్లో బిల్వ ఆకులను కోయకూడదని శాస్త్రం చెబుతోంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా పాటించే ముందు ఆధ్యత్మిక గురువులు పండితుల సలహా తీసుకోవడం తప్పనిసరి.