
ఆధ్యాత్మిక జగత్తులో భగవాన్ రమణ మహర్షిది ప్రత్యేక స్థానం. ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన భారతీయ ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి బోధనలు లక్షలాది మంది మనసులను తాకాయి. ‘‘ఈ విశ్వంలో ఉన్నది ఒకటే వస్తువు. ఆ వస్తువు అంతటా ఉంది. దానిని తెలుసుకోవటం జ్ఞానం.. తెలియకపోవటం అజ్ఞానం’’ అని భగవాన్ రమణ మహర్షి బోధించారు. మనిషి తనను తాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని ఆయన బోధనలు తెలియజేస్తాయి.
భగవాన్ రమణ మహర్షి చెప్పిన ఓ చిన్న ఉదాహరణ మనందరినీ ఎంతో ఆలోచింపజేస్తుంది. ఒక వ్యక్తి చెట్టును గట్టిగా పట్టుకుని ‘‘నన్ను వదులు.. నన్ను వదులు’’ అని అరుస్తూ ఉంటాడు. వాస్తవానికి చెట్టు అతన్ని పట్టుకోలేదు. అతడే చెట్టును పట్టుకున్నాడు. వదిలేయాల్సింది కూడా అతడే.. ఈ ఉదాహరణ మన జీవితానికి అద్దం పడుతుంది. మన జీవితంలో కోరికలు, ఆశలు, అహంకారం, భయాలు, కోపం, అసూయ వంటి భావోద్వేగాలను మనమే గట్టిగా పట్టుకుని వాటి వల్ల బాధపడుతూ ఉంటాము. ఆ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటూ పరితపిస్తూ ఉంటాము. అయితే సమస్యకు పరిష్కారం బయట లేదని, మన మనసులోనే ఉందని గ్రహించలేకపోతామన్న సత్యాన్ని రమణులు చెట్టు కథలో హృదయానికి హత్తుకునేలా వివరించారు.
మనలో చాలామంది ప్రశాంతత కోసం విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. పూజలు, ధ్యానాలు, యోగాభ్యాసం, ఆధ్యాత్మిక గురువుల సాంగత్యం వంటి మార్గాలను అనుసరిస్తారు. ఇవన్నీ మనసును స్థిరపరచడానికి సహాయపడినా, అసలు మార్పు మాత్రం మనలోనే ప్రారంభం కావాలి. మన బంధాలకు, బాధలకు మూలకారణం ఏమిటో తెలుసుకుని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేసినప్పుడే నిజమైన స్వేచ్ఛను అనుభవించగలమంటారు రమణ మహర్షి.
రమణ మహర్షి బోధన మనకు ఓ గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. బంధాలు బయట ప్రపంచం సృష్టించినవి కావు. మన ఆలోచనలు, మన అనుబంధాలే వాటికి కారణం. వాటిని గుర్తించి విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనసుకు ప్రశాంతత, జీవితానికి ఆనందం, ఆత్మకు విముక్తి లభిస్తాయి.
Also Read: ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ అదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం