
బంగారం కొనుగోళ్లకు శుభసూచకంగా భావించే అక్షయ తృతీయ వచ్చేసింది. కాసేపట్లో అక్షయ తృతీయ తిథి ప్రారంభం కాబోతోంది. వివిధ రకాల శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ రేపు అయినప్పటికీ.. తిథి ప్రారంభం మాత్రం కాసేపట్లో.. అంటే.. 5గంటల 32 నిమిషాలకు మొదలు కానుంది. ఈ లెక్కన రేపు మధ్యాహ్నం 2గంటల 15నిమిషాలకు వరకు అక్షయ తృతీయ కొనసాగనుంది. దీంతో ఉదయం 5.32 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల మధ్యలో ఎప్పుడైనా బంగారం కొనొచ్చు. అయితే.. తిథి ఎప్పుడు ప్రారంభమైనా.. శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయను రేపే జరుపుకోనున్నారు.
వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ తిథిని అక్షయ తృతీయగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున పవిత్ర కార్యాలు, దానాలు, పూజలు, హోమాలు లాంటివి నిర్వహిస్తే శాశ్వతమైన ఫలితాలు ఇస్తుంటాయని పండితులు చెప్తుంటారు. బంగారు కొనుగోళ్లతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంతోపాటు.. శాశ్వతమైన సంపద చేకూరుతుందని భావిస్తారు. అందుకే.. ఈ శుభ దినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ.. ఈ సారి.. అక్షయ తృతీయకు.. రోహిణి నక్షత్రం కూడా కలిసి రావడాన్ని మరింత పవిత్ర దినంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సారి బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనేది ఇంట్రస్టింగ్గా మారుతోంది.
ఇదిలావుంటే.. గోల్డ్ కొనుగోళ్లకు కేరాఫ్ అయిన అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరగడం షాకిస్తోంది. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. మళ్లీ పరుగు పెడుతోంది. వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం రేటు.. ఇవాళ స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్స్ బంగారం ధర 490 రూపాయలు పెరగడంతో పది గ్రాముల గోల్డ్ రేటు 98వేల 900 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం ధర 450 రూపాయలు పెరిగి.. 91వేల 580 రూపాయలకు చేరింది. ఇక.. అక్షయ తృతీయ నాటికి బంగారం ధర మరింత తగ్గుతుందని భావించిన కొనుగోలుదారులకు పసిడి ధర పెరుగుదలతో నిరాశ ఎదురవుతోంది.