ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్.. !

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చుతో సందర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ద్వారకాధీశ్ ఆలయం, ఎల్లోరా గుహలతో పాటు ఐదు ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కల్పించనుంది. జూలై 11, 2026న ప్రారంభమయ్యే ఈ యాత్ర జూలై 21న ముగుస్తుంది.

ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్.. !
Jyotirlingas Dashan

Updated on: Jun 23, 2026 | 7:57 PM

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చుతో సందర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ద్వారకాధీశ్ ఆలయం, ఎల్లోరా గుహలతో పాటు ఐదు ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కల్పించనుంది. జూలై 11, 2026న ప్రారంభమయ్యే ఈ యాత్ర జూలై 21న ముగుస్తుంది.

ఈ 11 రోజుల పర్యటనలో ద్వారక, సోమనాథ్, నాగేశ్వర, భీమాశంకర్, త్రియంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి కలగలిపిన ఈ ప్రత్యేక యాత్ర భక్తులకు మరపురాని అనుభూతిని అందించనుంది. ప్రయాణం మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి ప్రారంభమవుతుంది. సత్నా, మైహర్, కట్ని, జబల్‌పూర్, నార్సింగ్‌పూర్, ఇటార్సీ, రాణి కమలపతి, షుజల్‌పూర్, ఉజ్జయిని తదితర స్టేషన్లలో కూడా ప్రయాణికులు రైలును ఎక్కే అవకాశం కల్పించారు. తిరుగు ప్రయాణంలో ఖాండ్వా, ఇటార్సీ, జబల్‌పూర్, కట్ని, సత్నా, రేవా వంటి స్టేషన్లలో దిగవచ్చు.

ప్యాకేజీ ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. స్లీపర్ క్లాస్‌కు ఒక్కో వ్యక్తికి రూ.20,250, 3ACకి రూ.33,250, 2ACకి రూ.44,000గా నిర్ణయించారు. ఈ మొత్తంలో రైలు ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సేవలు చేర్చారు.

యాత్రలో భాగంగా జూలై 13న ద్వారక చేరుకుని ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం బేట్ ద్వారక, నాగేశ్వర మహాదేవ్ ఆలయాలను దర్శిస్తారు. తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణే సమీపంలోని భీమాశంకర్, నాసిక్‌లోని త్రియంబకేశ్వర్, ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శిస్తారు. చివరగా ప్రపంచ వారసత్వ కట్టడమైన ఎల్లోరా గుహలను వీక్షించే అవకాశం ఉంటుంది.

ప్రయాణికులకు ఉదయం టీ లేదా కాఫీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించనున్నారు. రోజుకు ఒక లీటర్ రైల్‌నీర్ వాటర్ బాటిల్, స్థానిక రవాణా కోసం బస్సులు, టూర్ ఎస్కార్ట్‌లు, భద్రతా సిబ్బంది సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ప్రత్యేక దర్శన టిక్కెట్లు, స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మందులు వంటి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

ఆధ్యాత్మిక యాత్రతో పాటు భారతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ఆస్వాదించాలనుకునే భక్తులకు ఈ IRCTC ప్రత్యేక టూర్ ఒక అరుదైన అవకాశంగా నిలవనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us