Surya Grahan: గ్రహణకాలంలో తెరచి ఉంచే దేవాలయం శ్రీకాళహస్తి.. రాహు, కేతు ప్రత్యేక పూజలు.. భారీగా భక్తులు

|

Oct 25, 2022 | 1:04 PM

దేశంలో గ్రహణ సమయంలో తెరచి ఉండి.. విశేష పూజలను జరుపుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం. ఇక్కడ ఆలయంలో గ్రహణ సమయంలో విశేష పూజలు జరుగుతాయి.

Surya Grahan: గ్రహణకాలంలో తెరచి ఉంచే దేవాలయం శ్రీకాళహస్తి.. రాహు, కేతు ప్రత్యేక పూజలు.. భారీగా భక్తులు
Srikalahasti Temple
Follow us on

భారతీయ సంస్కృతిలో గ్రహణానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణ సమయంలో మనుషులే కాదు పశుపక్షాదులు కూడా కదలవని నమ్మకం. ఇక దేశంలోని ప్రముఖ దేవాలయాల సహా అనేక ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయానికి సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి అప్పుడు మళ్ళీ భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. అయితే దేశంలో గ్రహణ సమయంలో తెరచి ఉండి.. విశేష పూజలను జరుపుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం. ఇక్కడ ఆలయంలో గ్రహణ సమయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈరోజు సాయత్రం సూర్యగ్రహణ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయం తెరచి ఉంటుంది. ఆలయాలన్నీ మూతపడ్డా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు వాయులింగేశ్వరుడు. ఈరోజు అంతా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. శ్రీ కాళహస్తి ముక్కంటి క్షేత్రంలో యధావిధిగా రాహు కేతు పూజలతో పాటు.. గ్రహణ సమయంలో అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.

గ్రహణం పట్టని ఏకైక దేవాలయం: 
సూర్యగ్రహణమైన, చంద్రగ్రహణమైనా దేశంలోని గుడులు అన్నీ మూసివేస్తారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయాలను శుద్ధి చేసి మళ్ళీ భక్తులను అనుమతిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీజ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఈ పుణ్యే క్షేత్రంలో వెలసిన వాయులింగేశ్వరుడిని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు పురాణాల కథనం. శివలింగాకృతిపై.. శ్రీ(సాలీడు), కాళము(పాము), హస్తి(ఏనుగు)లతో పాటు.. భక్తకన్నప్ప గుర్తులు ఉంటాయి.  వాయులింగేశ్వరుడు సూర్య, చంద్రులు, అగ్నిభట్టారడితో పాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందువల్లనే ఈ క్షేత్రంలో రాహు, కేతువుల ప్రభావం చూపలేరని పురాణాల కథనం.

ఇవి కూడా చదవండి

ఈ క్షేత్రంలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు. సూర్యగ్రహణ సమయంలో గ్రహణం ప్రారంభ సమయంలో శ్రీకాళ హస్తీశ్వరుడికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు. అదే చంద్ర గ్రహణం అయితే విడుపు సమయంలో ఈ అభిషేకాన్ని జరుపుతారు. గ్రహణ సమయంలో రాహు, కేతు, సర్ప దోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే.. విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకనే గ్రహణ సమయాల్లో భారీగా భక్తులు ఆలయానికి చేరుకొని వాయులింగేశ్వరుడిని పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)