వ్యాక్సిన్ డేటా హ్యాకింగ్పై వచ్చిన ఆరోపణలు ఖండించిన రష్యా..
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికా, బ్రిటన్, రష్యాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలు తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి..
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికా, బ్రిటన్, రష్యాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలు తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన టీకా.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు చేరకున్న సంగతి తెలిసిందే. ఇక అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ కూడా కీలకమైన థర్డ్ ఫేస్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే రష్యా కూడా ముందడుగులోనే ఉంది. సెషనోవ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ ఆగస్ట్ రెండో వారంలో అందుబాటులోకి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ జరిగితే.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన ఘనత రష్యాకే చెందుతుంది.
అయితే ఈ క్రమంలో రష్యాపై యూకే, యూఎస్, కెనెడాలు సంచలన ఆరోపణలు చేశాయి. కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన డేటాను హ్యాకింగ్ చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్లో ఓ భాగమైన ఏపీటీ-29 లేదా కోజీ బేర్ అనే హ్యాకింగ్ గ్రూపు.. ఫార్మాసుటికల్ రీసెర్చ్ సంస్థల సమాచారన్ని హ్యాక్ చేశాయంటూ బ్రిటన్,యూఎస్, కెనెడాలు ఆరోపణలు చేశాయి. అయితే ఈ ఆరోపణలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కానీ.. తమ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి హ్యాకింగ్కు పాల్పడలేదని.. ఇవన్నీ నిరాధార ఆరోపణలంటూ రష్యన్ ప్రతినిధి కొట్టిపారేశారు. కాగా, ఆరోపణలు చేసిన బ్రిటన్, యూఎస్,కెనెడాలు ఏం డాటాను హ్యాక్ చేశారన్నది కానీ.. ఇతర వివరాలను కానీ తెలుపలేదు.