వైయస్‌ షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ.. అనుకోకుండా వచ్చారా..? రాయబారిగానే వచ్చారా..?

|

Feb 11, 2021 | 5:20 PM

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ఏసీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం..

వైయస్‌ షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ.. అనుకోకుండా వచ్చారా..? రాయబారిగానే వచ్చారా..?
Follow us on

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ఏసీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందు కోసం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు రూట్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేస్తంది షర్మిల టీం. ఈ నేపథ్యంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి షర్మిలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లోటస్ పాండ్‌లోని జగన్ నివాసంలో గురువారం మధ్యాహ్నం షర్మిలతో రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. షర్మిలతో మాట్లాడిన అనంతరం బ్రదర్ అనిల్ కుమార్‌తో కూడా రామకృష్ణారెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్ అనుమతితోనే షర్మిలను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలినట్లు తెలుస్తోంది. జగన్ దూతగా షర్మిలతో మాట్లాడేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారని తెలుస్తుంది.

షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం నేడు ముగిసింది. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు. పోడు భూముల అజెండాగా ఖమ్మంలో సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు. షర్మిల తన పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉండగానే ఆళ్ల భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

అయితే షర్మిల పార్టీ పెట్టడం, అందులో జగన్ ప్రస్తావన లేకపోవడంపై ఏపీలో చర్చ జరుగుతోంది. అన్నా- చెల్లెళ్ల మధ్య గొడవలు ఉన్నాయనే ప్రచారం పెరిగింది. జగన్ ప్రత్యర్థులకు ఇదొక అస్త్రంగా మారింది. ఇలాంటి చర్చకు తావివ్వకూడదని భావించిన షర్మిల కుటుంబం అంతా ఒక్కటే అని సూచించేందుకే ఫ్లెక్సీల్లో జగన్, విజయమ్మ ఫోటోలను కూడా పెట్టాలని సూచించినట్లు సమాచారం.

మొత్తానికి ఫ్లెక్సీల్లో మార్పు కావచ్చు.. మరో అంశం కావచ్చు.. లోటస్‌పాండ్‌లో షర్మిలతో సమావేశమయ్యారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. జగన్‌కు, షర్మిల పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే చర్చ జరుగుతున్న సమయంలో ఆర్కే షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప తగ్గించేందుకే ఆర్కే లోటస్‌పాండ్‌కు వచ్చారా అనేది మరో ఇంట్రస్టింగ్ పాయింట్‌గా మారింది.

 

Read more:

ఆ పాట నేను వంద సార్లు విన్నా.. మీరు కూడా విని ప్రజల కష్టాలు తీర్చండి.. మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు