సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు స్వీప్( Systematic Voters’ Education and Electoral Participation (SVEEP)) కార్యక్రమంతో ఓటర్లను చైతన్యం చేస్తున్నారు.
92 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముందుకుసాగుతున్నారు. రోజూ ఒక్కో బృందం 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ అక్కడి ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మూడు మొబైల్ వాహనాల ద్వారా గత ఎన్నికల్లో నగరంలో ఎక్కడైతే అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైందో అక్కడ ముమ్మరంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా ఓటర్లు ప్రత్యక్షంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరును తెలుసుకున్నారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు, వీవీప్యాట్లపై ఓటర్లకు ఉన్న సందేహాలను తీర్చడంతోపాటు స్వయంగా నమూనా పోలింగ్లో పాల్గొనేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.