ఎన్డీయే కూటమి నేతలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా విందు ఇచ్చారు. ఢిల్లీలోని అశోకా హోటల్లో ఇచ్చిన ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తొలిసారి జరిగే ఈ ఎన్డీయే పక్షాల భేటీకి జేడీయూ నేత నితీశ్కుమార్, అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం పళనిస్వామి, ఎల్జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాసవాన్, అప్నాదల్ నేత అనుప్రియ పాటిల్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం చేపట్టాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు.
ఎన్డీయేకు అనుకూలమైన ఫలితాలు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఎన్డీయే వైపు ఆకర్షితులయ్యే పార్టీలు, నేతలెవరు? ప్రభుత్వం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వంలో కూర్పు ఎలా ఉండాలనేదానిపై కీలక చర్చలు జరుపుతున్నారు. బీహార్, బెంగాల్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్లో బీజేపీకి ఈసారి అధికంగా సీట్లు వస్తాయని నేతలు ఆశిస్తున్నారు. గతంలో ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిన రాజకీయ పార్టీలను ఎలా దగ్గర చేసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. కాగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ఎన్డీయే నేతలతో పాటు కేంద్రమంత్రులందరితోనూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఎన్నికలు జరిగిన విధానం, భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే దానిపై మోదీ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.