
అమేధితో పాటు కేరళలోని వాయినాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఇవాళ వాయినాడ్లోని తిరునెల్లి దేవాలయాన్ని రాహుల్ సందర్శించారు. సాంప్రదాయ పట్టువస్త్రాలు ధరించిన రాహుల్, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ముఖ ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి ప్రవేశించారు. చేతి వేళ్లకు కుశలను ధరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే.. బ్రహ్మగిరిపై అతి పురాతనమైన మాధవ విష్ణు దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు రాహుల్. బ్రహ్మగిరి పాద భాగంలో ఉన్న పాపనాశిని నదీ జల్లాల్లో తండ్రి రాజీవ్ గాంధీకి తర్పణలు వదిలారు.
పూజలు నిర్వహించిన అనంతరం రాహుల్ వాయినాడ్ నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. పట్టనంతిట్టలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 72వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే న్యాయ్ పథకాన్ని.. తాము అధికారంలోకి రాగానే తెస్తామన్నారు.