సోనియా గాంధీకి షాక్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంది బీజేపీ. ఇందులో భాగంగా సోనియా ఎంపీగా పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి మాజీ ఆర్మీ మేజర్ సురేంద్ర పునియాను బరిలోకి దించాలని బీజేపీ ఆలోచిస్తోందట.
కాగా తాజాగా బీజేపీలో చేరిన ఆర్మీ మాజీ మేజర్ సురేంద్ర పునియా తాను రాయ బరేలి నియోజకవర్గం నుంచి సోనియాగాంధీపై పోటీ చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. మోడీ కోరిక మేరకు తాను రాయబరేలీలో పోటీ చేస్తున్నానని.. మోడీ ఇది నాకిచ్చే గౌరవంగా భావిస్తున్నానని.. రాయబరేలీలో ఎన్నికల పోరు రసవత్తరం సాగుతుందని మాజీ మేజర్ తెలిపారు.
ఇకపోతే 2004 నుంచి వరుసగా సోనియాగాంధీ రాయబరేలీ నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారిందనే చెప్పాలి. దీనితో ఆమెకు సరైన ప్రత్యర్థిగా మేజర్ను దించాలని బీజేపీ ఆలోచిస్తోందట.
కాగా మార్చి 23న పునియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. భారత సైన్యంలో మేజర్గా ఉన్నప్పుడు పునియా పలు విశిష్ట సేవలు చేశారు. ఈయన సేవలకు గానూ విశిష్ట సేవా మెడల్ లభించింది. ఇకపోతే 2014 సార్వత్రిక ఎన్నికల్లో పునియా రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీచేశారు.