ఈ లాంగ్ మార్చ్కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ముందుగా బిజెపి ఈ లాంగ్ మార్చ్కు సంఘీభావం ప్రకటించింది. ఆ తర్వాత బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు కేవలం ఇసుక ఆందోళనకే కానీ.. జనసేనకు కాదని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ క్లారిఫికేషనే అసలు లాంగ్ మార్చ్ వెనుక పొలిటికల్ ఉద్దేశం వుందేమో అన్న అనుమానం కలిగేలా చేసింది.
ఇసుకపై పోరాటం పేరిట విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చే వ్యూహాన్ని జనసేన అమలు చేస్తుందా అన్న చర్చ మొదలైంది. అనుకున్నట్లుగానే జనసేన పార్టీ టిడిపిని కూడా సంప్రదించింది. ముఖ్యనేతలతో సమావేశమైన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.. జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్కు మద్దతు ప్రకటించారు. టిడిపి ముఖ్యనేతలు లాంగ్ మార్చ్లో పాల్గొంటారని ప్రకటించారు చంద్రబాబు.
మరోవైపు ఇసుకపై ఆల్రెడీ ఆందోళన కొనసాగిస్తున్న వామపక్షాలు కూడా పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. సో.. బిజెపి పాల్గొనకపోయినప్పటికీ.. సంఘీభావం ప్రకటించింది. అటు టిడిపి, ఇటు వామపక్షాలు లాంగ్ మార్చ్లో పాల్గొంటున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఏపీలో అన్ని పక్షాలను జనసేన ఒక్కతాటికి తీసుకువచ్చినట్లయింది.
కానీ.. చివరి క్షణంలో సీన్ రివర్స్ అయ్యింది. బిజెపిని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వామపక్షాలు.. లాంగ్ మార్చ్కు హాజరు కాలేమంటూ ఉమ్మడిగా జనసేనానికి లేఖ రాశాయి. ఉమ్మడి అఖిలపక్షం ఏర్పడడంతో.. ఏపీలో ముందు ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ వర్సెస్ మహాకూటమి (పేరు ఏదైనా కావచ్చు ఉమ్మడి అఖిలపక్షం కలిసి)గా మారే సంకేతాలు కనిపించాయి. అయితే.. వామపక్షాలు యూ టర్న్ తీసుకోవడంతో జనసేన డబుల్ యాక్షన్ ప్లాన్ బెడిసికొట్టినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.