Raj Bhavan : ఉద్రిక్తతలకు దారితీసేలా పరిస్థితులు..! రాజ్ భవన్‌కు కాంగ్రెస్ జెండాలు కట్టిన కార్యకర్తలు.. పోలీసులు హై అలర్ట్

|

Jul 16, 2021 | 11:11 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'రాజ్ భవన్' నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరసనకు పోలీసులు..

Raj Bhavan : ఉద్రిక్తతలకు దారితీసేలా పరిస్థితులు..! రాజ్ భవన్‌కు కాంగ్రెస్ జెండాలు కట్టిన కార్యకర్తలు.. పోలీసులు హై అలర్ట్
Congress Flag
Follow us on

Telangana Congress Party – Chalo Raj Bhavan : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరసనకు పోలీసులు పాక్షికంగా అనుమతిలిచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ తీస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు పిలుపునివ్వగా, ఈ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు మరో అడుగుముందుకేశారు. ఉదయాన్నే రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ జెండాలు కట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పోలీసులు లేని సమయంలో రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలు కట్టినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా, నేడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్ భవన్’ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర గా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయి. దీంతో రాజ్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రాజ్ భవన్ గేటుకి అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.

కట్ చేస్తే..  రాజ్ భవన్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదట.!

మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. రాజ్ భవన్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లకు జెండాలు కట్టిన ఉదంతంతో అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలిసొచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ ముట్టడి నేపథ్యంలో ఆగ మేఘాల మీద ఇప్పుడు రిపేర్లు, మరమత్తులు చేపట్టారు. అదీ.. సంగతి.

Cctv

ఇలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చలో రాజ్​భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 200 మందితో ఇందిరాపార్క్ దగ్గర సమావేశం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, ఇందిరాపార్క్ నుంచి రాజ్​భవన్ వరకు ప్రదర్శనగా వచ్చి గవర్నర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇందిరాపార్కు తోపాటు రాజ్​భవన్​కు వచ్చే మార్గంలో పలు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

అయితే, నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చలో రాజ్​భవన్ కార్యక్రమాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్వహించే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు పోలీసులు సర్వ సన్నద్ధమయ్యారు. మరోవైపు, చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లనే ముట్టడిస్తామని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని టీపీసీసీ చీఫ్ తేల్చి చెప్పారు.

ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన రేవంత్.. అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనున్నామని, ఇవాళ చేయబోయే ధర్నా పార్లమెంట్‌ను కూడా తాకనుందని రేవంత్ అన్నారు. ధరలపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. పెట్రోల్, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై మూడు రోజుల క్రితమే టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా పోరుబాట పట్టి సైకిల్ ర్యాలీలు, ఎడ్లబండ్ల ర్యాలీలు తీసిన సంగతి తెలిసిందే.

పనిలోపనిగా.. రేవంత్ రెడ్డి పెట్రో ధరల పెంపు మీద ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ లపై విమర్శలు ఎక్కుపెట్టారు. వీరిద్దరూ కలిసి 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ అసలు ధర 40 నలబై రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు, కేంద్రం 33 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదన్నారు.

Raj Bhavan

Read also: Gazette reactions: ‘మా ట్యాగ్ లైన్ నీళ్లు’. నీళ్ల కోసం రాజ్యాలు కూలిపోయాయి.. తక్షణమే గెజిట్ వెనక్కి తీసుకోకుంటే ఖబడ్దార్.!