ఏసీపీ, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించిన దళిత సంఘాలు.. భూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌

|

Mar 09, 2021 | 9:41 AM

తమ భూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏసీపీ, ఆర్డీవో కార్యాలయాలను దళిత కుటుంబాలు ముట్టడించాయి. నిజమాబాద్ జిల్లా నందిపేట్ మండలం..

ఏసీపీ, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించిన దళిత సంఘాలు.. భూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌
Follow us on

వారు నిరుపేద దళితులు. వారసత్వంగా సంక్రమించిన భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇంతలో భూబకాసురుల కన్ను వారి భూమిపై పడింది. ఇంకేముంది.. వారిని తన్ని తరిమేశారు. భూముల్లో తిష్ట వేశారు. దీంతో తమ భూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏసీపీ, ఆర్డీవో కార్యాలయాలను దళిత కుటుంబాలు ముట్టడించాయి. నిజమాబాద్ జిల్లా నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు న్యాయం కోసం రోడ్డెక్కాయి. తమ భూమిని కొందరు భూబకాసురులు అక్రమించారని అన్నారని వారి నుంచి తమ భూమిని విడిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని తమకే అప్పగించాలని ఏసీపీ, ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

గత కొన్ని రోజుల నుంచి గ్రామ శివారులోని వివాదాస్పద భూమిని దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. అయితే తమపై భూబకాసురులు ఇష్టానుసారంగా దాడి చేసి, తమ భూములను ఆక్రమించుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. తమపై దాడి చేసిన వారి పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పోలీసులు, అధికారులపై మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఒక్క అధికారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి ఏసీపీ, ఆర్డీవో కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించిన దళితులు నిరసన చేపట్టారు. గ్రామ శివారులో మారంపల్లి కి వెళ్లే రోడ్డు పక్కనే ఉన్నటువంటి సర్వేనెంబర్ 494, 495, 496 లో గల ఇరవై నాలుగు ఎకరాల భూమిని దొంకేశ్వర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. తమ పూర్వీకులు ఈ భూముల్లో పంటలు పండించారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టా చేసుకున్న వ్యక్తులకు తమకు కు ఈ భూమి విషయంలో వివాదం నెలకొందని చెప్పారు.

ఈ నేపథ్యంలో మరోసారి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలోని 86 దళిత కుటుంబాలలో పదులసంఖ్యలో గుంట భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమి తమకే దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏసీపీ రఘుకు వినతిపత్రం సమర్పించారు.

Read More:

కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం.. మహిళా దినోత్సవం వేడుకల్లో ఆ పాటతో శాసనసభాపతి భావోద్వేగం

విశాఖలో మిన్నంటిన నిరసనలు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో ఉద్యమం ఉధృతం

విద్యారంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా..? -మంత్రి కేటీఆర్‌