
రాఫెల్ యుద్ధవిమానాల డీల్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాఫెల్ డీల్పై దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ నేతలు, ప్రధాని ఇక్కడకు వచ్చి తప్పుడు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ప్రజలు కనీసం ఒక్కసారైనా అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించాలని, ఇందుకు ప్రతిగా అనిల్ అంబానీ మీకేమిచ్చారని కూడా నిలదీయాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాఫెల్ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని తెలిపారు.
15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.5,55,000 కోట్ల రుణాలు రద్దు చేశారని, అంటే ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కుని మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, అనిల్ అంబానీకి ఇచ్చారని ఆరోపించారు. అదే రైతులు అడిగితే ఒక్క రూపాయి కూడా రద్దు చేసేందుకు మోదీ ఇష్టపడలేదన్నారు. చౌకీదార్నని చెప్పుకుంటున్న మోదీకి రోజంతా అబద్ధాలు చెప్పడమే పనని, ఐదేళ్లుగా ఆయన చేస్తున్నది కూడా అదేనని ఘాటుగా విమర్శించారు.