మండలి రద్దుకు కార్యరూపం ఎప్పుడు?

| Edited By: Pardhasaradhi Peri

Jan 27, 2020 | 2:38 PM

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయం పలు అంశాలపై ప్రభావం చూపనుంది. అయితే.. ఈ రద్దు ఉన్నట్లుండి సాధ్యమవుతుందా అన్న చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. దానికి తోడు రద్దు అమల్లోకి రావాలంటే కనీసం మూడేళ్ళు పడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అంటున్నారు. నిజంగానే అంత సమయం పడుతుందా అన్నదిపుడు చర్చగా మారింది. జాతీయ స్థాయిలో చాలా కాలం నుంచి శాసనమండళ్ళు అవసరమా అన్న చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ […]

మండలి రద్దుకు కార్యరూపం ఎప్పుడు?
Follow us on

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయం పలు అంశాలపై ప్రభావం చూపనుంది. అయితే.. ఈ రద్దు ఉన్నట్లుండి సాధ్యమవుతుందా అన్న చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. దానికి తోడు రద్దు అమల్లోకి రావాలంటే కనీసం మూడేళ్ళు పడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అంటున్నారు. నిజంగానే అంత సమయం పడుతుందా అన్నదిపుడు చర్చగా మారింది.

జాతీయ స్థాయిలో చాలా కాలం నుంచి శాసనమండళ్ళు అవసరమా అన్న చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిళ్ళను రద్దు చేశారు. ప్రస్తుతం ఏపీ కాకుండా కేవలం అయిదు రాష్ట్రాలలోనే శాసన మండళ్ళు పనిచేస్తున్నాయి. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోనే కౌన్సిళ్ళు వున్నాయి. గతంలో మండళ్ళను రద్దు చేసి, తిరిగి పునరుద్ధరణ కోరుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, బెంగాల్, పంజాబ్, అస్సాం, మధ్యప్రదేశ్ వున్నాయి.

కాగా.. ఇటీవల రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌లో గత ఆగస్టులో మండలి రద్దైంది. అయితే.. మండలిని ఏర్పాటు చేయాలని మరికొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. వీటిలో రాజస్థాన్, ఒడిషా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి.

తాజాగా ఏపీలో మండలిని రద్దు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందనేది అంతుచిక్కిన ప్రశ్నగా మారింది. ఇప్పటికే కేంద్రం వద్ద పలు రాష్ట్రాల తీర్మానాలు పెండింగ్‌లో వున్నాయి. వీటిలో కర్నాటక, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీహార్ కూడా పరోక్షంగా బీజేపీ ఖాతాలో వున్నట్లే భావించాలి. సొంత పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాల తీర్మానాల కంటే ముందుగా ఏపీ తీర్మానాన్ని కేంద్ర ఎందుకు పరిశీలిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ నేత యనమల చెప్పినట్లు మండలి రద్దు కార్యరూపం దాల్చడానికి 2,3 ఏళ్ళు కాకపోయినా.. అందులో సగమైనా పట్టే ఛాన్స్ చాలా మటుకు వుంది. ఈ నేపథ్యంలో ముందు ముందు రానున్న బడ్జెట్ సెషన్ లాంటి ఘట్టాలను ప్రభుత్వం ఏ విధంగా దాటుకు వెళుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది.