
శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. అయితే నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట మెలకువగా, పగలు దైనందిక పనులతో గడిపేస్తున్నారు. అలాంటివారికి ప్రశాంతమైన నిద్రను అందించే కొన్ని రకాల ఆసనాలు ఉన్నాయి. వాటిని వేయడం ద్వారా పని ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు.

వజ్రాసనం: నిద్ర సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా వేయవలసని ఆసనాలలో ప్రప్రథమమైనది ఈ వజ్రాసనం. రాత్రి భోజనం తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు వజ్రాసనంలో గడపండి. ఇలా చేయడం ద్వారా మీరు తేలికగా ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు. ఇంకా ఈ ఆసనం ద్వారా శరీర రక్త ప్రసరణ, ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అసిడిటీ, మలబద్ధకం వంటి అన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీకు వెన్నునొప్పి సమస్య ఉన్నట్లయితే.. దానికి కూడా వజ్రాసనం ఓ చక్కని పరిష్కారం.

భద్రాసనం: నిద్రలేమితో బాధపడేవారి మనస్సును ప్రశాంతపరిచి వారికి నిద్రపట్టేలా చేయగల మరో ఆసనం ఇది. మనసు ప్రశాంతంగా ఉండడం ద్వారా మీలో నిద్ర కలిగేలా చేస్తుంది. ఈ భద్రాసనంలో గడపడం వల్ల మీ దిగువ శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా మీ తొడ కండరాలకు దృఢపరుస్తుంది.

ఉత్తాన పృష్ఠాసనం: మానసిక ప్రశాంతతలను కలిగించే ఆసనాలలో ఉత్తన పృష్ఠాసనం ప్రముఖమైనది. ఇది మీ ఒత్తిడిని నియంత్రించడంతో పాటు భావోద్వేగాలను అదుపు చేయడం, దృష్టిని మెరుగుపరచడం, సృజనాత్మకతను ఉత్తేజపరచడం వంటి మార్పులకు కారణమవుతుంది. రాత్రి భోజనం తర్వాత కేవలం ఒక్క నిముషం ఈ ఆసనంలో కనుక మీరు గడిపితే చాలు ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు. ఇంకా ఈ ఆసనం మీ బెల్లీ ఫ్యాట్ను తగ్గించి, శరీర ఫ్లెక్సిబిలిటీని కూడా మెరుగుపరుస్తుంది.

విపరీత కర్ణి: విపరీతకర్ణి ఆసనం లేదా ఆసన ముద్ర మీ శరీరానికి గురుత్వాకర్షణ సంపూర్ణ ప్రభావాలను అందిస్తుంది. శరీరభాగాలకు పరస్పరరక్త మార్పిడిని ప్రోత్సహించి విశ్రాంతికరమైన మార్పులకు కారణమవుతుంది. అలా మీరు నిద్రలోకి జారుకునేలా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ఆసన ముద్ర శరీరంలోని ఎండోక్రైన్ గ్రంధులతో సహా నడుము పైన ఉన్న వివిధ అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.