
రోజూ రెండు అంజీర్ పండ్ల తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని అంటున్నారు. దీంతో పాటు అంజీర్లను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అంజీర్ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ పరగడుపునే నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను తినాలని సూచిస్తున్నారు. ఇవి ప్రేగు కదలికలను సరిచేసి.. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. అలాగే, పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అంటున్నారు.

రెండు అంజీర్లను రాత్రి నిద్రపోయే ముందు నీటిలో నానబెట్టాలి. వీలైతే వాటిలో బాదం, వాల్ నట్స్ కూడా వేసి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ పరగడపున అంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తొలగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఉన్న మహిళలు, రుతుక్రమ సమస్యలతో బాధపడే అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యత సమస్యల బారిన పడుతూ ఉంటారు. వారంతా కచ్చితంగా అంజీర్ పండ్లను తింటే మంచిదని సూచిస్తున్నారు.

అంజీర్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు ఎంతో ఆరోగ్యకరం. అంజీర్లో ఉండే విటమిన్ ఎ,సి, ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. స్కిన్కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్ను రోజూ తింటే జుట్టుకు మంచిది.