శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే కిడ్నీ క్రియారహితంగా ఉంటే శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి ప్రాణాపాయం పెరుగుతుంది.
క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వివిధ కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
కిడ్నీలు దెబ్బ తింటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే.. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు కనిపించే మొదటి లక్షణాలు కాళ్ళలో ఉంటాయి. కిడ్నీలో సమస్య వస్తే ముందుగా చీలమండలు ప్రభావితమవుతాయి. చీలమండ వాపు ప్రారంభమవుతుంది. ఇలాంటి లక్షణాలు మీకు కూడా కనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు ఉబ్బడం ప్రారంభిస్తాయి. ఫలితంగా నేలపై నిలబడటం కష్టంగా మారుతుంది. విపరీతంగా కాళ్ల నొప్పులు మొదలవుతాయి. అరికాళ్లలో నొప్పి కూడా కిడ్నీ సమస్యల లక్షణం. ఎక్కువ నడిచిన తర్వాత లేదా నిద్ర లేచిన తర్వాత నేలపై అడుగు పెట్టడం కష్టంగా మారుతుంది.
కాళ్ల వాపు, తుంటి కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, అజీర్ణం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం కనిపించడం వంటివి కూడా కిడ్నీ సమస్యల లక్షణాలే. ఇవి సంభవిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. మూత్రపిండాల సమస్యలను నివారించడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. బదులుగా, ఎక్కువ నీరు, పండ్లు, కూరగాయలు తినాలి. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.