
మొబైల్ ఫోన్ వాడకం మన జ్ఞాపకశక్తిని చంపేస్తోందని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. తరచూ ఫోను చూసుకుంటూ ఉండటం, ప్రతి చిన్న విషయానికి ఫోన్పై ఆధారపడటం.. వంటి అలవాట్లు మన మెదడుపై ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

అమెరికన్లు మొబైల్ను సగటున రోజుకు 344 సార్లు అంటే ప్రతి 4 నిమిషాలకు ఒకసారి చూస్తున్నారని ఓ సర్వే రిపోర్టు తెల్పింది. అంటే రోజుకు దాదాపు 3 గంటలు వాళ్లు ఫోన్తోనే గడుపుతున్నారన్నమాట.

అవసరం లేకపోయినా యథాలాపంగా ఫోన్ని తనిఖీ చేయాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. అప్రయత్నంగా పదే పదే ఫోన్ చెక్ చేయడం, నోటిఫికేషన్ని చూడటం వంటివి ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

ఎల్లవేళలా ఫోన్ వినియోగిస్తుంటే మెదడు చురుకుగా పనిచేయదట. ఫోన్లపై ఆధారపడటం వలన జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. బదులుగా ఆలోచించడం, చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవడం వంటివి చేయడం మూలంగా దానిని మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు. ఐతే రోజులో ఎంత వీలైతే అంత తక్కువగా ఫోన్ వినియోగించడం అలవాటు చేసుకోవాలి.

ఫోన్తో ఎక్కువసేపు గడిపితే 'బ్రెయిన్ డ్రెయిన్'కు కారణమవుతుంది. ఒక పరిశోధన ప్రకారం మన దృష్టిని ఫోన్పై నుంచి మరొక పనిపై బలంగా కేంద్రీకరించడం మూలంగా ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడొచ్చని తేలింది.