
చైనాకు చెందిన షియోమీ.. స్మార్ట్ ఫోన్లతో టెక్ మార్కెట్లో ఓ సంచలనంగా దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అనంతరం అన్ని రకాల గ్యాడ్జెట్లను రూపొందిస్తూ దూసుకుపోతోంది.

స్మార్ట్ ఫోన్లతో మొదలు పెట్టిన షియో ప్రస్తుతం ఇప్పుడు స్మార్ట్ వాచ్లు, టీవీలు, ఎయిర్ ప్యూరిఫయర్లు, ట్రిమ్మర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే షియోమీ ప్రొడెక్టుల జాబితాకు అంతేలేకుండా పోతోంది.

బడా కంపెనీలకు సైతం పోటీనిస్తూ ప్రత్యేకతను సంపాదించుకుంటున్న షియోమీ తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇంటి పనుల్లో సహాయం చేసే ఓ రోబోను రూపొందించింది.

సైబర్ డాగ్ పేరుతో తయారు చేసిన ఈ రోబో డాగ్ నాలుగు కాళ్లపై నడుస్తుంది. మంగళవారం షియోమీ పలు కొత్త గ్యాడ్జెట్లను విడుదల చేసే క్రమంలోనే ఈ సైబర్ డాగ్ ప్రకటనను చేసింది.

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రోబో సెకనుకి 3.2 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో నివిడియా సూపర్ కంప్యూటర్కు చెందిన చిప్సెట్ను అమర్చారు. ఈ రోబో తమ యజమానులను చాలా సులభంగా గుర్తిస్తుంది.

ప్రయోగాత్మకంగా ఈ రోబోను చైనాలో విడుదల చేసి అనంతరం ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సైబర్ డాగ్ ధరను మేకర్స్ చైనాలో 9,999 యువాన్లుగా ఖరారు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,14,737 అన్నమాట.