
కరోనా సమయం తర్వాత ల్యాప్టాప్లు, నోట్బుక్ల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రముఖ కంపెనీలన్నీ వీటిని తయారు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఆసుస్ డిటాచబుల్ సీజెడ్ 1 అనే క్రోమ్బుక్ను లాంచ్ చేసింది. దీన్ని లాప్ట్యాప్, ట్యాబ్గా ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆసుస్ దీనిని రూపొందించింది.

ఆసుస్ ఈ క్రోమ్బుక్ను ధృడత్వానికి మారుపేరుగా రూపొందించింది. ముఖ్యంగా మిలటరీ గ్రేడ్ టఫ్నెస్తో దీనిని రూపొందించారు. దీనికి నాలుగు మూలలదృఢమైన రబ్బరు రక్షణను అందించింది. ఇది క్రోమ్బుక్కు మరింత రక్షణ ఇస్తుంది.

ఇందులో 10.1 ఇంచుల ఫుల్హెచ్డీ(1920x1200 పిక్సెల్స్) ఎల్సీడీ డబ్ల్యూయూఎక్స్జీఏ టచ్స్క్రీన్ డిస్ప్లేను అందించింది. ఈ క్రోమ్ బుక్ మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఈ క్రోమ్ రూ. 18,000 నుంచి ప్రారంభంకానుంది.

ఈ క్రోమ్బుక్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీని అందించింది. అలాగే యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్ వంటి ఫీచర్లు అందించింది. దీంతో పాటు స్టైలస్ను కూడా అందించారు. దీనికి 15 సెకన్లు చార్జింగ్ చేస్తే 45 నిమిషాలు ఉపయోగించుకోవచ్చు.

ఈ క్రోమ్బుక్కు 8 మెగాపిక్సెళ్ల రెయిర్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ల్యాప్ట్యాప్ 500 గ్రాముల బరువు ఉంది.