
ప్రస్తుతం ప్రతి పల్లె పట్నంలోని ప్రతి వాడ వాడలో వినాయకుడిని ప్రతిష్టించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, ఆఫీసు భవనాల్లో ఇలా అన్ని చోట్ల వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుండగా అద్భుతం చోటు చేసుకున్నదంట. ఇంతకీ అది ఏమిటి అంటే?

వినాయక చవితి ఉత్సవాల వేళ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పూజలు చేస్తుండగా ఎలుక ప్రత్యక్షమైంది. భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఊహించని విధంగా వినాయక విగ్రహం వద్దకు ఎలుక వచ్చింది. విఘ్నేశ్వరుడి ఒడిలో కాసేపు, పాదాల చెంత కూర్చొని కనిపించింది.

విఘ్నేశ్వరుడి వాహనమైన మూషికం స్వయంగా వచ్చిందని భావించిన ఉపాధ్యాయుల విద్యార్థులు, ఉపాధ్యాయులు దైవ మహిమ గా భావించారు. సాధారణంగా మనుషులను చూస్తే పరుగులు తీసే ఎలుక, ఏమాత్రం భయం లేకుండా అలాగే ఉండిపోయింది. విద్యార్థులు భజన చేస్తున్న సమయంలో.. ఆ మూషికం కూడా ముందు కాళ్లు పైకి ఎత్తి కదిలించింది. దీంతో మూషికం కూడా పూజల్లో పాల్గొన్నట్టు అంతా భావించి ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇది గమనించిన హాస్టల్ వార్డెన్ శకుంతల.. ఆ మూషికానికి నమస్కరించారు. దాని నుదుటన బొట్టు పెట్టారు. అయినా ఎక్కడ మెరుపు లేకుండా అక్కడే కూర్చుని అన్ని సేవలు అందుకుంది ఆ మూషికం.

భక్తులు సమర్పించిన నైవేద్యం, పండ్లను ఆ మూషికం అక్కడే కూర్చుని ఎంతో ఇష్టంగా తిన్నది. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులంతా స్వామివారి నామస్మరణ చేశారు. విఘ్నేశ్వరుడి మహిమగా భావించిన హాస్టల్ ఉపాధ్యాయులు వార్డెన్.. వినాయకుడు చెంత ఉన్న ఆ మూషికాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.