
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న వసంతోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారిని మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పూలతో శోభాయమానంగా అలంకరించి దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.

పుష్పాల సుగంధంతో ఆలయ ప్రాంగణం పరిమళించగా, భక్తులు అమ్మవారి అలంకారాన్ని దర్శించి ఆనందభరితులయ్యారు.ఆలయ కార్యనిర్వహణాధికారి వీ.కే. సీనా నాయక్ స్వయంగా అమ్మవారికి పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వసంతోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భిన్న రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నారు.

వసంతోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నది. అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టి దర్శనాలను సజావుగా నిర్వహిస్తున్నారు.