
గురువారం జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు, వారి భవిష్యత్తు గురించి జ్యోతిష్యులు మచిరాజు కిరణ్ కుమార్ విపులంగా వివరించారు. గురువారానికి అధిపతి దేవగురువు బృహస్పతి కాబట్టి, ఈ రోజున జన్మించిన వారు గురువు స్వభావం వల్ల శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. సద్గుణాలు, మంచి పనులు చేయాలనే తపన, ఇతరులను కూడా సత్కార్యాల వైపు ప్రోత్సహించే గుణం వీరిలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీరు తమ జీవిత లక్ష్యాలను ఆలస్యంగానైనా తప్పకుండా సాధిస్తారు. మంచి అధికారులుగా కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం వీరికుంది.

ప్రజల మనిషిగా.. సమాజసేవ పట్ల అమితమైన ఆసక్తి, దైవ చింతన, పాప భీతి వీరిలో ప్రముఖంగా ఉంటాయి. దేవాలయాలు నిర్మించడం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడంలో వీరు సమర్థులుగా నిరూపించుకుంటారు. తమ సుఖ దుఃఖాలను ఇతరులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ, మనసులోని అభిప్రాయాలను మాత్రం స్పష్టంగా వ్యక్తం చేస్తారు. తన వాళ్ళు, ఇతరులు అనే తేడా లేకుండా అందరిపై డబ్బు విపరీతంగా ఖర్చుపెట్టే లక్షణం వీరిలో ఉంటుంది. తమ వారికంటే కూడా వాస్తవానికి ఇతరులకే ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంత ధనం ఉన్నా ఇతరుల ముందు ఆడంబరంగా కనిపించరు. వీరు ఎక్కడ పనిచేసినా నమ్మకంగా ఉంటారు.

సహాయం చేస్తారు కానీ.. ఎదుటి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడరు. ఎదుటి వారు చెప్పిన విషయాన్ని పూర్తిగా నమ్మకుండా, తమ మనసుకు నచ్చిన విషయాన్ని మాత్రమే ఆచరిస్తారు. భగవంతుడిపై వీరికి ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. పెద్దలను, గురువులను గౌరవిస్తారు. ఏ పని చేసినా న్యాయమార్గంలోనే చేస్తారు. వీరు ఎవరినీ సహాయం అడగరు కానీ, ఎవరైనా సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేస్తారు. సొంత పనుల కంటే సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలు, సాంఘిక సేవ, సేవా కార్యక్రమాలు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

వీరి కలిసొచ్చే ఉద్యోగాలు ఇవే.. విద్యాపరంగా పరిశీలిస్తే, జ్యోతిష్య శాస్త్రం, గణిత శాస్త్రాలలో గురువారం జన్మించిన వారు బాగా రాణిస్తారు. సంగీత, సాహిత్య, కవిత్వ రంగాల్లో కూడా వీరికి మంచి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ (CA) చదివితే అద్భుతంగా రాణించి గొప్ప చార్టెడ్ అకౌంటెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మచిరాజు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యోగపరంగా ఉపాధ్యాయులు, పురోహితులు, బ్యాంకు ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రభుత్వ సంస్థల్లో కార్యనిర్వహణ అధికారులు, ధార్మిక సంస్థలు, సేవా సంస్థలలో అధికారులుగా వీరు విశేషంగా రాణిస్తారు.

ఇలా చేస్తే మరిన్ని శుభ ఫలితాలు.. ఆరోగ్యపరంగా మాత్రం జీర్ణ సంబంధమైన సమస్యలు, నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారానికి అధిపతి దేవగురువు బృహస్పతి కాబట్టి, ప్రతిరోజూ ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభించి, జీవితంలో మంచి పురోగతిని సాధించవచ్చని మచిరాజు కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ మంత్ర పఠనం చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)