
తిరుమల శ్రీవారికి జులై మాసంలో కాసుల వర్షం కురిసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ జులై నెలలో స్వామివారికి రూ.55.58 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. అలాగే స్వామివారికి రూ.3.97 కోట్లు ఈ-హుండీ ఆదాయం దక్కింది.

అటు గత నెలలో తిరుమల శ్రీవారిని మొత్తం 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు.

అలాగే 35.26 లక్షల శ్రీవారి లడ్డూలు జులై మాసంలో విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే 2.55 లక్షల మంది భక్తులు మలయప్ప స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు.

జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.