
తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం కన్యామాసం ఆశ్వయుజ మాసంలో విజయదశమి వరకు నవాహ్నికంగా నిర్వహించే ఉత్సవాలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజు పాటు శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి రెండు రథాలు కలిపి మొత్తం 16 రకాల వాహనాలపై తిరు వీధిల్లో వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.

ఈ రోజు శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు. సోమవారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. కల్పవృక్షం నీడన పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి.

కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.

ఈ రోజు సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకటయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు.