ఈ ఆలయంలోకి వెళ్లిన భక్తుల మనసు.. ఆలోచనలు అన్నీ దొంగతనం మీదనే ఉంటుందట. దేవుడి గుడిలో దొంగతనం మహా పాపం అని ఆలోచించేవారికి ఇది వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్న అమ్మవారి దేవాలయంలో దొంగతనం చేసే వందల ఏళ్లుగా ఇదే ఆచారం కొనసాగుతుందట.
ఇలాంటి వింత ఆలయం దేవ భూమిగా ప్రసిద్దిగాంచిన ఉత్తరాఖండ్ లో ఉంది. రూర్కీ సమీపంలో ఉన్న చూడామణి దేవి ఆలయంలో ప్రత్యేకమైన సంప్రదాయంతో ఉంది. ఇక్కడ ఉన్న ఆచారం వింటే ఆశ్చర్యపోతారు. అవును ఎవరైనా దంపతులకు పిల్లలు పుట్టకపోతే, ఈ అమ్మవారి ఆలయంలో దొంగతనం చేస్తే.. వారి కోరిక నెరవేరుతుంది. పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ ఆలయం సంతాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది
సంతానం లేని భక్తులు గుడిలో దొంగతనం చేయాలట. దొంగతనం చేయమని స్వయానా పూజారులే చెబుతారు. అయితే ఆలయంలోని డబ్బులు, బంగారం లేదా విలువైన వస్తువులు కాదు దొంగతనం చేయాల్సింది.. చూడామణి అమ్మవారి పాదాల దగ్గర చెక్క బొమ్మలను దొంగలించిన వారికి పిల్లలు పుడతారని భక్తులు నమ్ముతారు. ఈ ఆచారం కొన్ని వందల ఏళ్లుగా వస్తోంది. చెక్క బొమ్మను దొంగిలించి ఇంటికి తీసుకెళ్లిన అనంతరం బిడ్డ పుట్టిన తర్వాత ఆ చెక్క బొమ్మను మళ్లీ ఎక్కడి నుంచైతే తీసుకున్నారో అక్కడే పెట్టాలట. అంతేకాదు ఈ బొమ్మకు మరొక బొమ్మని జోడించి రెండు బొమ్మలను పెట్టాలి
చూడామణి దేవి ఆలయం ఉత్తరాఖండ్లోని రూర్కీకి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్పూర్లోని చుడియాల్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి అమ్మవారి పాదాలలో ప్రపంచం ఉంటుందని విశ్వాసం. భక్తులు కోరుకున్న కోర్కెలు తీస్తుందని నమ్మకం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదంతో ఆశీర్వాదం పొందుతారు.
చూడామణి అమ్మవారి పాదాల దగ్గర బొమ్మలు ఉంటాయి. సంతానం లేని దంపతులకు పిల్లల కోసం ఈ బొమ్మని దొంగిలించి, బిడ్డ పుట్టిన తర్వాత జూన్ లేదా జూలై నెలలో కొడుకుతో కలిసి అమ్మవారి ఆలయానికి వస్తారు. ఇక్కడ అమ్మవారిని పూజించిన తర్వాత భక్తులు మరో బొమ్మని అమ్మవారిని సమర్పిస్తారు.
చూడామణి ఆలయంలో దొంగతనం చేసే పిల్లలు పుడతారు అన్న నమ్మకం వెనుక ఓ కథ ప్రచారం లో ఉంది. 1805లో లంధౌరా సంస్థానానికి చెందిన రాజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు బిడ్డను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాడు.
అమ్మవారు మాయమై చెక్కరూపంలో దర్శనమిచ్చింది. ఆ చెక్క బొమ్మను తీసుకొని ఇంటికి వెళ్లిన రాజు దంపతులకు కొన్నాళ్ల తర్వాత పండంటి బిడ్డ పుట్టాడు. రాజు దంపతులు తన బిడ్డను తీసుకుని ఆలయానికి వెళ్లి.. చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అప్పటి నుండి సంతానం లోసం బొమ్మని దొంగిలించే ఆచారం ప్రారంభమైందని ఆలయ పూజలు చెబుతారు.