
మరణానికి ముందు వచ్చే సంకేతాలు: గరుడ పురాణం ప్రకారం మరణం ఆకస్మికంగా రాదు; అది ఒక ప్రక్రియ. మరణానికి కొన్ని గంటల ముందు మనిషికి తన సొంత నీడ కనిపించదు, లేదా తల లేని నీడ కనిపిస్తుంది. అద్దంలో ప్రతిబింబం వికృతంగా కనిపిస్తుంది. సూర్యచంద్రులు రెండుగా కనిపించడం, చుట్టూ ఎవరూ లేకపోయినా చనిపోయిన బంధువులు కనిపిస్తూ పిలుస్తున్నట్లు భ్రమ కలగడం వంటివి జరుగుతాయి.

ప్రాణం పోయే క్షణం – యమదూతలు vs విష్ణుదూతలు: జీవితాంతం పాపాలు చేసిన వారికి భయంకరమైన రూపాలతో యమదూతలు వచ్చి ప్రాణాన్ని క్రింది ద్వారాల ద్వారా బలవంతంగా లాగుతారు. అదే ధర్మంగా జీవించిన పుణ్యాత్ములను తీసుకెళ్లడానికి విష్ణుదూతలు వచ్చి, తల్లి పసిపాపను లేపినంత సున్నితంగా బ్రహ్మరంధ్రం (తల) ద్వారా ప్రాణాన్ని శాంతియుతంగా వేరు చేస్తారు.

ఆ 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరాన్ని వదిలిన ఆత్మను యమపురికి తీసుకెళ్లి, చిత్రగుప్తుడి అనుమతితో మళ్లీ భూలోకానికి పంపిస్తారు. 10 నుండి 13 రోజుల పాటు ఆత్మ ప్రేత శరీరంతో తన ఇంటి చుట్టూనే వాయు రూపంలో తిరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు పెట్టే పిండ ప్రదానాలు, నీరు ఆత్మకు ఆహారంగా మారి సూక్ష్మ శరీరాన్ని ఏర్పరుస్తాయి. 13వ రోజున జరిగే వైకుంఠ సమారాధనతో ప్రేత స్థితి నుండి విముక్తి పొంది 86 వేల యోజనాల దూరంలో ఉన్న యమలోకానికి ప్రయాణమవుతుంది.

భయంకరమైన వైతరిణి నది & గోదానం: యమలోక మార్గంలో 100 యోజనాల వెడల్పుతో రక్తం, చీము, ఎముకలతో ప్రవహించే భయంకరమైన 'వైతరిణి నది' ఉంటుంది. పాపాత్ములు అందులో పడి నరకయాతన అనుభవిస్తారు. అయితే జీవితంలో గోదానం చేసిన పుణ్యాత్ములకు ఒక గోవు ప్రత్యక్షమై తన తోకతో ఆత్మను సునాయాసంగా నది దాటిస్తుంది.

కర్మఫలం – పునర్జన్మ: చిత్రగుప్తుడు రాసే 'అగ్రసంధాని' చిట్టా ఆధారంగా యమధర్మరాజు 28 రకాల నరకాల్లో శిక్షలు ఖరారు చేస్తాడు. పుణ్యం అయిపోయాక ఆత్మ వర్షపు చినుకులు, ధాన్యం ద్వారా మళ్లీ తల్లి గర్భంలోకి ప్రవేశించి పూర్వజన్మ కర్మల ఆధారంగా కొత్త జన్మను పొందుతుంది.