
అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రక్షా బంధనమే రాఖీ. ఒకరి పట్ల మరొకరి ప్రేమానురాగాలనూ , భాధ్యతను, రక్షణను గుర్తు చేస్తుంది ఈ రక్షాబంధన్. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి మరోలా ఉంటుంది. సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తమ తోబుట్టువులతో రాఖీలు కట్టించుకుంటూ సంబరపడిపోతారు.

అన్నా, తమ్ముడు ఎక్కడున్నా అక్కడికి వెళ్లి మరీ రాఖీ కడుతారు. కుదరకుంటే పోస్టులో పంపిస్తారు. పంపించిన విషయాన్ని ఒకటికి పదిసార్లు చెబుతారు. పంపించాను కట్టుకో అంటూ మెసెజ్ చేస్తారు.. ఫోన్ చేస్తారు.. తెలిసినవారు వెళ్తుంటే వారితో కూడా చెప్పిపంపిస్తారు. అయితే ఇప్పుడు కాలం కొద్దిగా మారింది. డైరెక్టు ఆన్లైన్లో బుక్ చేస్తున్నా.. తమ ప్రేమ మాత్రం తగడ్డం లేదు.

రాఖీ తీసుకుని ఇంటి వచ్చిన అక్కా, చెల్లి వెంట ఓ హారతి పళ్లెంతో వస్తారు. ఈ రాఖీ రక్షా బంధన్ పండుగ చాలా ప్రత్యేకమైనది. సోదరుడికి రాఖీ కట్టడానికి.. ఆమె చాలా ప్రేమతో ప్లేట్ను అలంకరిస్తుంది. అయితే, రక్షా బంధన్ ప్లేట్లో ఏయే అంశాలు ఉండాలో తెలుసుకుందాం.

సోదరీమణులకు రాఖీ ప్లేట్ చాలా ప్రత్యేకమైనది. సోదరుడికి రాఖీ కట్టే ముందు సోదరి చాలా ప్రేమగా అలంకరిస్తారు. మీరు రాఖీ ప్లేట్ను అలంకరిస్తున్నట్లయితే.. ఆ ప్లేట్ వెండితో(మనకు అనుకూలంగా) ఉండాలని గుర్తుంచుకోండి. అది ఇంటి ప్లేట్ అయితే.. దానిపై కొత్త గుడ్డ ఉంచండి.

పూజ ప్లేట్ మధ్యలో ఓం లేదా స్వస్తిక్ వేయండి. పూజ చేసే పళ్ళెంలో విరిగిపోని బియ్యంతో అక్షంతలు రెడీ చేసుకోండి. నుదుటిపై పెట్టేందుకు తిలకం..కుంకుమ భరిణి ఉండాలి. రాఖీలో హారతి సమయంలో సోదరుడి నుదిటిపై తిలకం.. ఆ తర్వాత అక్షత వేయండి.

రాఖీ ప్లేట్లో పసుపు,కుంకుమా, అక్షంతలు ఉండటం తప్పనిసరి. దీనితో పాటు మంచినీటితో నింపిన చిన్న కలశాన్ని కూడా హారతి పళ్ళెంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో దేవతామూర్తుల ఆశీస్సులు ఉంటాయని.. సోదరుడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు.

కొబ్బరికాయను దేవతల ఫలంగా భావిస్తారు. ఇది ప్రతి శుభ కార్యంలో ఉపయోగించబడుతుంది. రాఖీ కట్టేటప్పుడు పొట్టుతీయని కొబ్బరికాయను ఉపయోగించడం సోదరుడి జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

హారతి ప్లేటులో నెయ్యి దీపం(నూనె) వెలిగించి ఉంచండి. ఇది సానుకూలతకు చిహ్నంగా భావించబడుతుంది. దీపాలు వెలిగించి సోదరునికి హారతి ఇస్తారు. దీని వల్ల అన్నదమ్ముల స్వచ్ఛమైన ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

హారతి, రాఖీ కట్టిన తర్వాత సోదరీమణులు తమ సోదరులకు మిఠాయిలు అందజేస్తారు. అందుకే ప్లేట్లో స్వీట్లు ఉండాల్సిందే. ఈ రోజున అన్నదమ్ములకు మిఠాయిలు తినిపించడం ద్వారా అన్నదమ్ముల మధ్య అనుబంధంలో మధురానుభూతి మిగులుతుంది.