
హిందూ విశ్వాసం ప్రకారం అమ్మవారిని పూజించే సమయంలో సమర్పించే కొబ్బరికాయను పగలగొట్టేటప్పుడు అది పాడైపోయినట్లయితే.. అయ్యో అంటూ ఆందోళన చెందవద్దు.. ఎందుకంటే అది చెడు శకునము కాదు. జీవితానికి సంబంధించి ఏర్పడనున్న భారీ సంక్షోభం నుండి కోలుకోవడానికి అది ఒక సంకేతం కనుక భయపడాల్సిన అవసరం లేదు. కనుక నవరాత్రి సమయంలో పూజించిన కొబ్బరికాయ ఎండిపోయినా లేదా కుళ్ళిపోయినా చింతించకండి. అందుకు బదులుగా అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ మంచి కొబ్బరికాయను సమర్పించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచండి.

హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులలో ఏదైనా ఒక రోజున దుర్గాదేవిని మీ కలలో కనిపించినా.. లేదా పూజించినట్లు కనిపిస్తే అది శుభ సంకేతం. కలలో భగవతి దేవి దర్శనం అనేది ఒకరి జీవితంలో జరిగే కొన్ని శుభకార్యాలకు సంకేతమని నమ్మకం. దేవత ఆరాధనకు సంబంధించిన అలాంటి కల కూడా త్వరలో మీ కష్టాలు తొలగిపోవడానికి సంకేతంగా పరిగణించబడతాయి.

హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రి సమయంలో ఒక మట్టి కుండలో విత్తిన నవ ధాన్యాలు బాగా పెరిగితే, అది అమ్మవారి దయగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో పచ్చగా నవధాన్యాలు పెరగడం భవిష్యత్తులో సంతోషం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

నవరాత్రులలో 9 రోజులు అఖండ దీపం ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూ ఉంటే.. అమ్మవారి పూజ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయినట్లు.. మీ జీవితంలో సంతోషం, అదృష్టానికి సంకేతమని అర్ధం. అమ్మవారి ఆరాధన కోసం వెలిగించిన అఖండ దీపం ఏదైనా కారణం చేత ఆరిపోతే పూజ సమయంలో జరిగిన తప్పుగా భావించాలి. తాము తెలిసి తెలియక చేసిన తప్పును క్షమించమని అమ్మవారిని వేడుకుని.. మళ్ళీ అఖండ దీపం వెలిగించి పూజను కొనసాగించాలి.

నవరాత్రి చేసే పూజ సమయంలో భక్తుడు ఏదైనా నిర్దిష్ట పనిలో లేదా ఏదైనా పనిలో విజయం సాధిస్తే.. అమ్మవారి ఆరాధన సంపూర్ణం అని సూచిస్తుంది. అదే విధంగా ఇంట్లో సుఖ, శాంతి, సంతోషం ఉంటుందని.. అమ్మవారి అనుగ్రహం ఆ భక్తులపై ఉందని విశ్వాసం.