
తిరుపతి వెంకటేశ్వర దేవాలయం: దేశంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి. ఈ ఆలయంలోకి హిందూ మతస్థులు మాత్రమే అడుగు పెట్టేందుకు వీలు. ఇతర మతాల వారికి ప్రవేశం నిషేధం. హిందూయేతరులకు ఏడుకొండలపై ప్రవేశం నిషేధించబడింది. ఏదైనా ఇతర మతానికి చెందిన వారు ఈ ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. వారు వేంకటేశ్వర స్వామిపై తమకు ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి.

గురువాయూరు దేవాలయం: కేరళలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం గురువాయూరు దేవాలయం. ఇది హిందూ మత విశ్వాసానికి కేంద్ర బిందువు. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల నాటిది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఈ ఆలయ ప్రధాన దైవం గురువాయూరప్పన్ అంటే శ్రీ కృష్ణుడు బాల గోపాలుడి రూపంలో పూజలను అందుకుంటాడు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు, విష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా దీనిని దక్షిణ వైకుంఠం, ద్వారక అని కూడా పిలుస్తారు.

అనంత పద్మనాభస్వామి ఆలయం: విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలోని చారిత్రక దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన వివరణ హిందూ మత గ్రంథాలు, పురాణాలలో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజులు, చక్రవర్తులు నిర్మించారు. ఈ క్షేత్రానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే హిందువులు కాని వారిని ఆలయంలోకి అనుమతించరు.

జగన్నాథ దేవాలయం: ఈ ఆలయం విష్ణువు 8వ అవతారమైన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. జగన్నాథ దేవాలయం బంగాళాఖాతం సమీపంలోని పూరి నగరంలో ఉంది. ఈ ఆలయంలోకి హిందువులు తప్ప ఇతరులెవరికీ ప్రవేశం లేదు. ఆలయ ద్వారం దగ్గర డైరెక్షన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఆర్థడాక్స్ హిందువులకు ఈ ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. అంతే కాదు హిందువులు కాని వారితో సంబంధాలు ఉన్న వారిని కూడా ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించరు. 1984లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా ఆమె భర్త ఇతర మతానికి చెందినందున ఆలయంలోకి రానివ్వలేదు.

లింగరాజ ఆలయం: ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో నిర్మించిన లింగరాజు ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతన ఆలయం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే ఈ ఆలయంలోపలికి హిందూ మతానికి చెందిన వారు మాత్రమే వెళ్లగలరు. ఈ ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఖ్యాతి ఉందంటే.. సుదూర పాశ్చాత్య దేశాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వచ్చేవారు.. అయితే 2012లో ఒక విదేశీ పర్యాటకుడు ఈ ఆలయంలోకి వచ్చి .. ఆలయ ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగించాడు. ఆలయంలో అపచారం చేశాడు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు హిందువులు కాని వారికి గుడిలో ప్రవేశంపై ఆంక్షలు విధించారు.

కపాలీశ్వర ఆలయం: తమిళనాడులోని చెన్నైలో ఉన్న కపాలీశ్వర్ ఆలయం 7వ శతాబ్దంలో ద్రావిడ నాగరికత కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ శివయ్య భార్య పార్వతి నెమలి రూపంలో పూజించినట్లు స్థల పురాణం. ఈ ఆలయంలోకి హిందువులు కాకుండా ఇతర మతాల పర్యాటకుల ప్రవేశంపై నిషేధం ఉంది.