
1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ.. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర.. ప్రతి ఏటా రికార్డు ధర పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాలాపూర్ లడ్డూ. బాలాపూర్ లడ్డూ వేలానికి 30ఏళ్ల చరిత్ర ఉంది.

2002 నుంచి లక్షల్లోకి చేరి ఎప్పటికప్పుడు తన రికార్డులనే తానే బ్రేక్ చేసుకుంటూ వస్తుంది బాలాపూర్ లడ్డు. గతేడాది 27లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి ఎంత పలుకుతుందనే ఉత్కంఠ నెలకొంది.

బాలాపూర్ గణేష్ అంటే అందరికీ గుర్తొచ్చేది లడ్డూ వేలం పాటే. ఇక్కడ విగ్రహం ఎత్తు కంటే.. బాలాపూర్ గణేషుడి చేతిలో ఉంటే లడ్డూపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే, వేలం పాటలో ఆ లడ్డూ బద్దలుకొట్టబోయే రికార్డుల కోసం ఎదురుచూస్తుంటారు భక్తులు. బాలాపూర్ లడ్డూని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీపడుతుంటారు. లక్షలు రూపాయలైనాసరే లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే, ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రూల్ బుక్ మారింది. వేలంలో పాల్గొనాలనుకునేవాళ్లు గతేడాది వేలం మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అంటే, 27లక్షల రూపాయల ధరావత్తు కడితేనే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది. ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపజేశారు. వేలం పాటకు పోటీ తీవ్రంగా ఉన్నందునే ఈ నిబంధన తీసుకొచ్చామంటున్నారు నిర్వాహకులు.

30ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ రికార్డులు బద్దలుకొడుతూనే ఉంది. ఈసారి 30లక్షలు పలుకుతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. బాలాపూర్ లడ్డూ క్రియేట్ చేసే కొత్త రికార్డు ఏంటన్నదే ఇప్పుడు సస్పెన్స్. బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. వేలం పాట ముగియగానే ట్యాంక్బండ్ వైపు శోభాయత్ర మొదలుకానుంది.