
తిరుమల తరహాలో నిత్యపూజలు..కృష్ణా జిల్లా పామర్రు మండలం డోకిపర్రులో 2015లో ప్రతిష్టించబడిన ఈ ఆలయంలో తిరుమలలో అమలయ్యే శ్రీ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు అర్చనలు, తోమాల సేవ, నివేదనలు, సాయంత్రం ప్రత్యేక పూజలు, రాత్రి ఏకాంత సేవ వరకు శాస్త్రోక్తంగా కొనసాగుతాయి. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు తిరుమలలో దర్శనం చేసిన అనుభూతిని పొందుతున్నామని చెబుతున్నారు.

ప్రత్యేక సేవలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం..ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, ప్రతి గురువారం జరిగే తిరుప్పావడ సేవ ఈ ఆలయ ప్రత్యేకతగా నిలిచాయి. గురువారం రోజున స్వామివారికి నేత్ర దర్శనం, పుష్పాలంకరణతో పాటు తిరుప్పావడ సేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వరుసగా ఏడు గురువారాలు స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

ఏడాది పొడవునా యాగాలు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. డోకిపర్రు దేవస్థానంలో కేవలం నిత్య పూజలకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా సరస్వతి హోమం, పుత్రకామేష్టియాగం యాగం, నవగ్రహ హోమం, మహాలక్ష్మీ యాగం, వేంకటేశ్వర వ్రతం, మహా సుదర్శన హోమం వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు..

భక్తుల కోసం ఉచిత ఏసీ బస్సు..డోకిపర్రు వెంకన్న ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టిన సేవల్లో ఉచిత ఏసీ బస్సు ఒకటి. సమీప ప్రాంతాల నుంచి భక్తులను ఆలయానికి ఉచితంగా తీసుకువచ్చి, దర్శనం అనంతరం తిరిగి వారి ప్రాంతాలకు చేరవేసే ఈ సేవకు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. దర్శనానికి అన్ని సౌకర్యాలు..ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి మందిరాలు, వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతోంది.

నిత్య అన్నదానం మరో ఆకర్షణ..డోకిపర్రు వెంకన్న ఆలయంలో నిర్వహించే నిత్య అన్నదానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాణ్యమైన ఆహారంతో శని, ఆదివారాల్లో వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్ స్థాయి డైనింగ్ హాల్ను తలపించే విధంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది.అభివృద్ధి దిశగా అడుగులురోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతోంది. భవిష్యత్తులో మరిన్ని వసతులు కల్పించి డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.