ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి నాడు జరుపుకునే బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతి.. బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుని జన్మదినోత్సవం. ఇప్పుడు అంటే 2023వ సంవత్సరంలో జరుపుకునే బుద్ధ జయంతి గౌతమ బుద్ధుని 2585వ జయంతి.
భారతీయులు చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో ఒకటి. బుద్ధుడు 536 BCE(కామన్ ఎరాకి ముందు) సంవత్సరంలో కపిలవస్తులోని లుంబినీలో సిద్ధార్థునిగా జన్మించాడు. ఆయన తండ్రి శాక్య గణానికి అధిపతి అయిన శుద్ధోదనుడు. అతని తల్లి పేరు మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబంలోనే బుద్ధుడు జన్మించాడు.
గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు రాహుల అనే ఓ కుమారుడు పుట్టాడు. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు.
అయితే బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు.ఈ క్రమంలో ఆయన కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు.
తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు.అలా ప్రస్తుత బిహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చరిత్రకారులు చెబుతారు. ఆ ప్రాంతానికే ఇప్పుడు ‘బుద్ధ గయ’ అనే పేరు వచ్చింది.
తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేయడం విశేషం.
మహా పరనిభాన సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. కానీ కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు.. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు చావుపుట్టుకల గురించి తెలియజేయడానికి కావాలనే నిర్యాణమొందాడనే ఒక వాదన ఉంది.