
తెలంగాణలో బోనాల సందడి మొదలు అయ్యింది. పోతరాజుల , శివసత్తుల ఆటలు, అందరనీ ఆకట్టుకుంటున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభం అవ్వడంతో భాగ్యనగరం బోనమెత్తింది. పట్నం మొత్తం డోలు సప్పుడు, బోనాలతో సందడిగా మారింది. అయితే చాలా మందికి బోనం అంటే ఏంటో తెలియదు. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

బోనం అంటే, తెలుగులో భోజనం అని అర్థం అంటున్నారు పండితులు. బోనం అంటే దేవతలకు నైవేద్యం పెట్టడం. మట్టికుండను తీసుకొని అందులో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో బోనం వడి, అమ్మవార్లకు నైవేద్యం పెడుతుంటారు. ఇక అందరకీ ఒకేలా కాకుండా, ఒక్కో దేవతకు ఒక్కో రకమైన బోనం వండుతుంటారు.

బోనం వండిన తర్వాత దీనిని అందంగా అలంకరిస్తుంటారు. పసపు, నూనె, బియ్యం పిండి, కుంకుమతో బోనాన్ని అలంకరిస్తుంటారు. దానికి వేపకొమ్మలు, మరికొంత మంది బంతి పూలను చుట్టి బోనం తయారు చేసి అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అయితే ఈ బోనాలు చేయడం వెనక కూడా ఒక కథ ఉన్నదంట, భాగ్య నగరంలో 1813లొ చాలా మంది ప్లేగు వ్యాధితో మరణించగా, అప్పుడు మహాంకాలి అమ్మవారికి పూజలు చేయడం, బోనం సమర్పించడంతో ఆ వ్యాధి తగ్గిందంట. అప్పటి నుంచి బోనాలు ప్రారంభం అయ్యాయని చెబుతుంటారు.

అయితే ఈ బోనాన్ని కొంత మంది గ్లాస్ పెసరపప్పు, బెల్లం, పాలు, నెయ్యి, యాలకుల పొడి, నీళ్లతో వండుతుంటారు. ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా మంచి నీరుతో కడిగి అరగంట పాటు నానబెడతారు. తర్వాత మట్టి కుండలో సరిపడ నీళ్లు పోసి అవి మరుగుతున్న సమయంలో పప్పు వేసి ఉడకబెడతారు. అది బాగా ఉడికి మెత్తగా అయిన తర్వాత అందులో బెల్లం వేస్తారు. తర్వాత పాలు, యాలకుల పొడి వేసి 15 నిమిషాల పాటు ఉడకనిస్తారు.అంతే బోనం నైవేద్యం రెడీ.

మరికొంత మంది పసుపు అన్నం వండుతుంటారు. ఇంకొంత మంది చక్కెర వేసి కూడా బోనం వండుతారు. ఇలా ఒకొక్కరూ ఒక్కో విధంగా దేవతలకు తమకు ఇష్టమైన నైవేద్యం వండి పెడుతుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు