
ఈ అందమైన పురుగులు ఎక్కువగా ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. విత్తనాలు పెట్టి, అవి మొలకగా మారే సమయం ఆరుద్ర కార్తె. ఈ సమయంలో రైతులు అందరూ పొలంలోనే ఉండి పొలం పనులను పూర్తి చేసుకుంటారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుంటాయి.

ఇక తెలుగు పంచాంగం ప్రకారం, జూన్ 22న ప్రారంభమై జూలై5న ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. దీంతో వానలు జోరందుకుంటాయని చెబుతారు పెద్దవారు.మృగశిరలో తొలకరి చినుకులుతో వర్షాలు స్టార్ట్ అయ్యి, ఆరుద్ర కార్తెలో ఎడ తెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడతాయి. దీంతో రైతన్న మురిసి వరి నాట్లు వేయడం, పత్తి విత్తనాలు పెట్టడం, కొన్ని చోట్ల మొలకెత్తిన విత్తనాల వద్ద పొలం పనులు చేయడం చేస్తుంటారు.

అయితే ఎప్పుడూ ఆరుద్ర కార్తెలో కనిపించే ఈ ఆరుద్ర పురుగులు ఈ సారి ముందుగానే మృగశిర కార్తెలో దర్శనం ఇచ్చాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకున్నట్లు కనిపిస్తుంటాయి. ఇక ఇవి పొలం గట్లపై కనిపిస్తే వాటిని చూసి రైతు సంబరపడి మురిసిపోతాడు. ముఖ్యంగా ఈ ఆరుద్ర పురుగులు పంటలను నాశనం చేయవు. వీటివలన ఎలాంటి హాని ఉండదు. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ ఇవి చాలా ఇష్టం ఉంటుంది.

అంతే కాదండోయ్.. వీటికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎవరి పొలంలో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తాయో వారి పొలంలో పంట బాగా పడుతుందని చెబుతుంటారు పెద్దవారు. అందుకే ఇవి పంట చేనులో కనిపిస్తే రైతు సంబరపడిపోతాడు. ఇక ఈ మధ్య కురిసిన వర్షాలకు ఇవి కనిపించి కనువిందు చేస్తున్నాయి.

ఈ పురుగులు పంటలను పాడుచేసే హానికరమైన కీటకాలు, వాటి గుడ్లను ఇవి ఏరిపారేస్తాయి. ఎలాంటి కెమికల్స్ లేకుండానే శత్రు పురుగులను ఇవి అంతం చేస్తాయి. తొలకరి చినుకులు పడగానే కనిపించినఈ ఆరుద్ర పురుగులను చూసి రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు.